Fibernet Case Closed:"ఏపీ ఫైబర్నెట్లో అక్రమాలు జరగలేదు" కేసు క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
Fibernet Case Closed: జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై పెట్టిన ఫైబర్నెట్ కేసును ఏసీబీ కోర్టు కొట్టేసింది. అలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ నివేదికతో నిర్ణయం తీసుకుంది.

Fibernet Case Closed: ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కేసులో అక్రమాలు జరగలేదని సీఐడీ స్పష్టం చేసింది. ఫైబర్నెట్ ఎండీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, సీఐడీ నివేదికతో కేసును క్లోజ్ చేస్తున్నట్టు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అనేక రాజకీయ ఆరోపణలు చోటు చేసుకున్నాయి. వైసీపీ టీడీపీ మధ్య చాలా సార్లు మాటల యుద్ధం జరిగింది.
భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2014-19 మధ్య చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులో 321 కోట్లు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తునకు నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. 2021 జులై 11న ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 9న ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూదన్రెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మొత్తం 321 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు అందులో పేర్కొన్నారు. ఐపీఎస్ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 417, 409, 506, r/w 120-B, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2)r/w 13(1)(C)(D)కింద కేసు రిజిస్టర్ చేశారు.
చంద్రబాబు టెండర్ ప్రాసెస్ను మానిప్యులేటే చేసి , 33o కోట్లు ఫేజ్ -1పనులు టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కు ఇచ్చారని ఆరోపించారు. టెరా సాఫ్ట్వేర్ ఇన్కాప్ బ్లాక్ లిస్ట్లో ఉందని పేర్కొన్నారు. టెరా డైరెక్టర్లు చంద్రబాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు.
ఇందులో చంద్రబాబుతోపాటు, పదహారు మందిని నిందితులుగా సీఐడీ చేర్చింది. అందులో వేమూరి హరికృష్ణ ప్రసాద్, కే. సాంబశివరావు, ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు, టి. గోపీచంద్, టెరా సాఫ్ట్వేర్, నెట్ ఇండియా కంపెనీలను నిందితుల జాబితాలో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ 25గా చేర్చారు. అంతేకాకుండా 2023 అక్టోబర్ 31న హోమ్ సెక్రటరీ హరీష్గుప్తా జీవో ఎంఎస్. నెంబర్ 180 జారీ చేసి గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లోని ప్రాపర్టీలు అటాచ్ చేయాలని ఆదేశించారు. గతేడాది ఫిబ్రవరిలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు.





















