![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TTD Tirumala: అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం, 22న స్వర్ణ రథోత్సవం
Andhra Tirumala News: తిరుమలలో అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండవ రోజైన ఈ 22న స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
![TTD Tirumala: అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం, 22న స్వర్ణ రథోత్సవం TTD Tirumala Srivari Salakatla Vasantotsavam begin in Tirumala TTD Tirumala: అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం, 22న స్వర్ణ రథోత్సవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/21/0de3905dcf5150b7b52406913d5772651713718015652233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వైభవంగా స్నపన తిరుమంజనం (Snapana Tirumanjanam)
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
సప్తగిరులను తలపించిన వసంతమండపం -
టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వసంతమండపాన్ని శేషాచల అడవులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇందుకోసం 250 కేజిల వట్టి వేరు, 600 కేజిల సాంప్రదాయ పుష్పాలు, 10 వేలు కట్ ఫ్లవర్స్ తో సుందరంగా రూపొందించారు. పచ్చని చెట్లు, పుష్పాలతోపాటు పలురకాల జంతువుల ఆకృతులను ఏర్పాటుచేశారు. వీటిలో పులి, చిరుత, కోతులు, పునుగుపిల్లి, కొండచిలువ, కోబ్రా, నెమలి, హంసలు, బాతులు, హమ్మింగ్ బర్డ్, మైనా, చిలుకలు ఉన్నాయి. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఏప్రిల్ 22న స్వర్ణ రథోత్సవం
వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఏప్రిల్ 22న ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)