CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
Tirumala temple | తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలని, అన్య మతస్తులు ఉండకూదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వారి మనోభావాలు దెబ్బతీయకుండా షిఫ్ట్ చేస్తామన్నారు.

Chandrababu says only Hindus should work in Tirumala temple | తిరుమల: తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ ఎలాంటి కమర్షియల్ పనులు, కమర్షియల్ బిల్డింగ్ లకు అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వాటికి వేరే చోట స్థలం కేటాయిస్తామన్నారు. తిరుమల ఆలయంలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు. అన్య మతస్తులను తిరుమలలో కాకుండా ఇతర చోట్ల వారిని షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర మత ప్రార్థనా స్థలాల్లో హిందువులు లేకుండా చూస్తామన్నారు.
చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంగ అన్నదాన కేంద్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించాక చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి పవిత్రతను స్మరించుకుంటూ శ్రీవారి క్షేత్రానికి వస్తుంటాను. ఆయన ఆశీర్వాదంతో ప్రజల సేవకు పునరంకితం అవుతుంటాను. ఈరోజు నా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు. మా కుటుంబంతో కలిసి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకు తిరుమలలో అన్నదానం నిర్వహిస్తున్నాం.
అన్నదానం సత్రానికి భక్తుల విరాళం
ఎన్టీఆర్ హయాంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. నేడు 2200 కోట్ల కార్పస్ ఉంది. ప్రతి ఏడాది, ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం సత్రానికి తమ వంతు విరాళం అందిస్తున్నారు. ఇది శాశ్వతంగా జరిగే ప్రక్రియ. భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిది. మా కుటుంబసభ్యులం మొత్తం కలిసి ఈరోజు భక్తులకు వడ్డించాం. భావి తరాలు ఇలాంటి మంచి పనులు వీలున్నప్పుడు నిర్వహించాలి.
కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకున్నాను
నేను ప్రాణదాన కార్యక్రమం ప్రారంభించా. బ్రహ్మోత్సవానికి వచ్చిన సమయంలో తిరుపతి స్విమ్స్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచం నుంచి ఎవరైనా భక్తులు ఇక్కడికి వస్తే వారు కూడా మానవ సేవ చేస్తున్నారు. ఈ ఏడు కొండలలో అపవిత్ర కార్యక్రమాలు గానీ, తిరుమలలో కమర్షియల్ బిల్డింగ్స్ కట్టడం కానీ జరగకూడదు. అసెంబ్లీలో 5 కొండలు అన్నారు. ఆ సమయంలో పాదయాత్రతో వచ్చి మొక్కులు తీర్చుకున్నాను. ప్రభావితం చేయగలిగే వ్యక్తులు మౌనంగా సమాజానికి నష్టం జరుగుతుంది. 24 క్లైమోర్ మైన్స్ నా మీద ప్రయోగించారు. నేను తప్పించుకుకోవడం అసాధ్యం. కానీ సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు. అందరం బతికినా గాయాలయ్యాయి. 24 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశాక మేం బతికామంటే శ్రీవారి మహిమకు అది నిదర్శనం. తిరుమలలో తెలిసో తెలియక అపచారం జరిగితే తప్పులు దిద్దుకోవాలి. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో స్వామి వారి ఆలయంలో అపచారం జరిగింది.
విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు
ఇతర రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తాం. ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటాం. హిందువులు ఉన్న చోట ప్రపంచం మొత్తం వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే యోచన ఉందన్నారు. స్వామి వారి ఆలయం ఉన్నచోట్ల ప్రశాంతత ఉంటుంది. ఎలాంటి టెన్షన్ ఉండదు. స్వామి వారి ఆలయం తరఫున ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తాం. శ్రీవారి సేవకులుగా ఉండేవారితో భక్తులకు మెరుగైన సేవలు అందేలా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

