Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Tirumala Darshan Tickets : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది.

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై టీటీడీ ప్రకటన జారీ చేసింది. ఈనెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ డిసెంబరు 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది. అనంతరం లక్కీడిప్లో టికెట్లు కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 8వ తేదీ రోజ 54 వేల 609 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26 వేల 718 మంది తలనీలాలు సమర్పించగా, 3.39 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో బయట ఎంబసీ వరకూ క్యూలైన్సులో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి సేవలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారము తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటుతరువాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
ఆగమోక్తంగా సేవలు
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయం వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహించారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభించారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహించారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా అర్చకులు ఏకాంత సేవను నిర్వహించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















