![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Fake Votes Controversy : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫేక్ ఓటర్లపైనా విచారణ - సీఈసీకి టీడీపీ లేఖ
TDP : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫేక్ ఓటర్లపైనా విచారణ జరపాలని టీడీపీ సీఈసీకి లేఖ రాసింది. డిగ్రీ చదవని వాళ్లకూ ఓటు ఇచ్చారన్నారు.
![AP Fake Votes Controversy : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫేక్ ఓటర్లపైనా విచారణ - సీఈసీకి టీడీపీ లేఖ TDP has written to CEC to investigate fake voters in graduate MLC elections AP Fake Votes Controversy : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫేక్ ఓటర్లపైనా విచారణ - సీఈసీకి టీడీపీ లేఖ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/c78614a76929f377afa1097f597093a01705750424977228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Fake Votes Controversy : ఆంధ్రప్రేదశ్లో నకిలీ ఓట్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది.తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా జరిగిన అవకతవకల కారణంగా ఓ కలెక్టర్ ను సస్పెండ్ చేశారు. తాజాగా గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల సహకారంతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు కానివారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలపై గానీ, అధికారులపై గానీ నేటికి ఎలాంటి చర్యలు లేవన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతీ ఫిర్యాదుతోపాటు ఆధారాలను సైతం ఎలక్షన్ కమిషన్కు పంపామన్నారు. ఓ ఫిర్యాదుపై మాత్రం ఐపీసీ సెక్షన్ 171 డీ, రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం ఇద్దరు తిరుపతి మునిసిపల్ కార్పొరేటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దొంగ సర్టిఫికేట్లతో గ్రాడ్యుయేట్లుగా సర్టిఫై చేసి ఓటు హక్కు కల్పించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మేం అడిగిన గ్రాడ్యుయేట్లు కానీ ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందారన్న సమాచారం మాకు నేటికి ఇవ్వలేదన్నారు.
అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారన్నారు. బోగస్ ఓట్లు నమోదు చేసి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో గిరీషాతో పాటు అనేకమంది అధికారులు, అధికారపార్టీ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక 2021లో జరిగింది. ఓటరు గుర్తింపు కార్డులను కొందరు ఈసీ వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో తిరుపతి కార్పొరేషన్కు గిరీషా కమిషనర్గా పనిచేసేవారు. అలాగే, లోక్సభ ఉప ఎన్నికకు ఆయన ఈఆర్వోగా వ్యవహరించారు. ఆయన ఐడీతో వేలాది ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయవాడలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు గ్రాడ్యూయేట్ ఎన్నికల ఓటర్లపైనా విచారణ జరిగితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)