YS Sharmila: సోమాలియాలాగే ఏపీ - సర్కార్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
Andhra Welfare hostels: KGH లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పరామర్శించారు. సోమాలియా పరిస్థితులే గుర్తొచ్చాయన్నారు.

AP government Welfare Hostels: విజయనగరం జిల్లా కురుపాం సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులు ఆస్పత్రి పాలయిన ఘటనపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వారిని విశాఖ కేజీహెచ్లో పరామర్శించారు. బిడ్డల శరీరాలు చూస్తే ప్రభుత్వం ఏం భోజనం పెడుతుందో అర్థం అయిందిని.. సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వచ్చాయన్నారు.
నేను ఈ మధ్య గుడితో పాటు బడి ముఖ్యం అని అడిగా.. వెల్ఫేర్ హాస్టళ్లలో కనీస వసతులు లేవని ప్రశ్నించా.. నా వ్యాఖ్యలకు మతం రంగు పూసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. ఇవ్వాళ కురుపాం గురుకులం ఘటన నేను చేసిన డిమాండ్ కి నిదర్శనమని.. మతం మీద మాకు సంస్కారం లేకుంటే.. బిడ్డల ప్రాణాలు తీయడం మీ సంస్కారమా అని ప్రశ్నించారు. స్వర్ణాంధ్ర 2047 కాదు ..స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలన్నారు. రెండేళ్లలో సంక్షేమ హాస్టళ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన హాస్టల్లో కనీసం త్రాగడానికి నీళ్లు కూడా ఉండటం లేదని.. కలుషిత నీరు త్రాగి బిడ్డలకు ఈ పరిస్థితి ఏర్పడిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరం.. కొంతమంది ICU లో చావు బ్రతుకులతో పోరాటం చేస్తున్నారని అన్నారు. హాస్టల్లో RO సిస్టం పనిచేయడం లేదని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని .. వెల్ఫేర్ హాస్టళ్లు అంటే ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత నీరు త్రాగి అస్వస్థకు గురైన విద్యార్థినిలను విశాఖపట్నం KGH ఆసుపత్రిలో కలిసి పరామర్శించడం జరిగింది. బిడ్డల తల్లిదండ్రులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాం. KGH లో చికిత్స పొందుతున్న… pic.twitter.com/eY1QNXQYXJ
— YS Sharmila (@realyssharmila) October 7, 2025
గిరిజన బిడ్డలంటే ఎవరికి లెక్కలేదని.. రాష్ట్రంలో ఏ సంక్షేమ హాస్టల్లో కూడా RO సిస్టమ్ పని చేయడం లేదని ఆరోపించారు. RO వాటర్ ప్లాంట్ పని చేస్తేనే వింత.. లేకుంటే కామన్ అని విద్యార్థులు చెప్పారని.. SC,ST,BC ల సంక్షేమంపై ప్రభుత్వానికి బాధ్యత లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. బిడ్డలు చూస్తే నోట్లో నాలుక లేనట్లే ఉన్నారు... ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోలేరన్నారు. పిల్లల తల్లిదండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారు.. మంచి నీళ్ళు, భోజనం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని మండిపడ్డారు.
కురుపాం గురుకులం ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని.. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఒకే హాస్టల్ రూమ్ లో ఏకంగా 17 మంది బిడ్డలు నేల మీద నిద్ర పోతున్నారని,, ఇదే విషయాన్ని నేను ఈమధ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించా.. - గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగానన్నారు. తాను అడిగిన ప్రశ్నకు మతం రంగు ఎందుకు పులిమారో చెప్పాలన్నారు. వ్యక్తిగతంగా నాకు అన్ని మతాలు సమానమే ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక మతానికి పెద్దపీట వేస్తున్నారు.. మిగతా మతాల వారికి అభద్రతా భావం కలిగిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని మతాలను సమానంగా చూడాలి కదా అని ప్రశ్నించారు.
మేము డిమాండ్ చేసింది ఒకటే... దళితవాడల్లో, హాస్టల్లో బాత్ రూమ్ లు లేవని.. హాస్టళ్లలో కనీస వసతులు లేవని... ఇవ్వాళ కురుపాం ఘటన మేము డిమాండ్ చేసిన దానికి నమూనా మాత్రమేనన్నారు. కురుపాం బిడ్డల చావులకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మీరు బాగుచేయక పోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తాం అన్ని సంక్షేమ హాస్టళ్లను తిరుగుతామని హెచ్చరించారు. - కురుపాం లాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఒక హైలెవల్ కమిటీని వేయాలని.. నిరంతర మానిటరింగ్ పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.





















