కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు సజీవ దహనం
Bus Fire Accident in Kurnool: కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధమైన ఘటనలో 20 మంది సజీవ దహనం కాగా, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
LIVE

Background
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ బస్సు మంటలు చెలరేగి దగ్ధమైంది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 12 మంది గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. వి. కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్నూలు శివారు చిన్నటేకూరులో నేషనల్ హైవే 44పై ప్రమాదానికి గురైంది.
ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
అమరావతి: కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సీఎస్తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా స్పందించి సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అసలే తెల్లవారుజాము కావడంతో బస్సులోని వారు గాఢనిద్రలో ఉన్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. బస్సులోని సగం ప్రయాణికులు మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు. మంటలకు వెంటనే అప్రమత్తమైన కొందరు బస్సు దిగి కాలిన గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్లు పరారయ్యారని సమాచారం.
కర్నూలు బస్సు ప్రమాదంలో రావులపాలెం వ్యక్తి మృతి.
కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందిన యువకుడు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39) దుర్మరణం పాలయ్యాడు. శ్రీనివాసరెడ్డి క్రేన్ ఆపరేటర్గా జీవనం సాగిస్తుంటారు. రెండు రోజుల క్రితం పని నిమిత్తం హైదరాబాద్కి వెళ్లి, అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు బయలుదేరగా దారిలో కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడు భార్య లక్ష్మీ జ్యోతి గృహిణి. కుమారుడు వెంకటరెడ్డి (ఎనిమిదవ తరగతి), కుమార్తె దివ్య (మూడో తరగతి) ఉన్నారు
కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు సజీవ దహనం
బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి.. బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి(27). దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లిన అనూష రెడ్డి, ధాత్రి. హైదరాబాద్లో ఉండే మేనమామ దగ్గరికి వెళ్లి, అక్కడే ట్రావెల్స్ బస్సు ఎక్కిన ధాత్రి.. ఖైరతాబాద్లో బస్సు ఎక్కిన అనూష రెడ్డి. వి కావేరి ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు వెళ్తుండగా బస్సు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.





















