Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!
ఏపీలో సోమవారం నాడు సైతం పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా, కొన్నిచోట్ల భారీ క్యూ లైన్లు ఉంటున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. సాధారణం కంటే సరఫరా పెంచినా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంకు నిర్వాహకులు నిల్వలను పొదుపుగా వాడుతూ, వాహనదారులకు పరిమితంగానే పెట్రోల్ను పోస్తున్నారు. దీనివల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సిటీలోని ఆటోనగర్, మొగల్రాజపురం, బెంజిసర్కిల్ వంటి ప్రధాన కూడళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కో వాహనదారుడు తమ అవసరానికి సరిపడా ఇంధనం కోసం మూడు నాలుగు బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్ కావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం డీజిల్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, లారీలు, ట్రాక్టర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. కొందరు ముందుజాగ్రత్తగా డబ్బాలతో వచ్చి ఇంధనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
idhi harvest time...big harvester machines ki diesel leka ...Farmers diesel cans pattukuni petrol bunk dagra nunchunnar .... 4th day of crisis @ncbn...extra stock entha theppincharu...prajalu telsukovali anukuntunaru #AndhraPradesh pic.twitter.com/RfQv290gzy
— 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) April 27, 2026
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుందన్న భయంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దాంతో బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల స్టాక్ లేక బంకులు మూతపడగా, చీరాలలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో అక్కడ వాహనదారుల రద్దీ నియంత్రించడం అసాధ్యంగా మారుతోంది. ఇంధన కొరత కారణంగా ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న అధికారులు, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
Day 2 ⚠️🚨#Petrol & #Diesel Shortage, Most of the fuel stations are Closed only few Stations are Available #Tirupati #AndhraPradesh pic.twitter.com/wV7K8iUIZY
— VANILLA BOY (@ChillMaava) April 27, 2026
ఆదివారం సమీక్షించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సోమవారం కల్లా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించగా, రిటైల్ అవుట్లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసిందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగిన తీరును గణాంకాలతో సహా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణంగా రోజుకు 6,330 కేఎల్ పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది ఏకంగా 34 శాతం పెరిగి 8,489 కేఎల్కు చేరింది. ఆదివారం కూడా సాధారణం కంటే 22 శాతం అదనంగా వినియోగం జరిగింది. డీజిల్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, శనివారం 16 శాతం అదనపు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. అగ్రికల్చర్ మరియు ఆక్వాకల్చర్ అవసరాలు పెరగడం కూడా దీనికి ఒక కారణమని అధికారులు పేర్కొన్నారు.
ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, అవసరమైతే రైతులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడా ఇంధనం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికి రాష్ట్రంలో ఎక్కడా 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదని అధికారులను ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















