![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
APJAC Amaravati: సీఎం జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ఉద్యమం - కార్యాచరణ ప్రకటించిన బొప్పరాజు !
ఏపీ ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. 9వ తేదీ నుంచి ఉద్యోగుల నిరసనలు ప్రారంభమవుతాయి.
![APJAC Amaravati: సీఎం జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ఉద్యమం - కార్యాచరణ ప్రకటించిన బొప్పరాజు ! AP JAC Amaravati announced movement activity against AP government. APJAC Amaravati: సీఎం జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ఉద్యమం - కార్యాచరణ ప్రకటించిన బొప్పరాజు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/06/93d6024068418f015ab787c241b9f3d51678098041864228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
APJAC Amaravati: ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. 9 వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చెబుతారు. 20వ తేదీ వరకూ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తారు. 21వ తేదీ నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తారు. ఇందులో భాగంగా 21వ తేదీ అసలు సెల్ ఫోన్లు ఉపయోగించుకుండా విధులు నిర్వహిస్తారు. 24వ తేదీన కమిషనర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు. 27వ తేదీన కరోనా సమయంలో ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. కారుణ్య నియామకాలపై ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరిస్తారు. మూడో తేదీన స్పందన కార్యక్రమంలో ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఐదో తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నరి్మయించారు.
ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.నాలుగేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఉద్యోగ వర్గాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా రావాల్సినవి.. మేం దాచుకున్న డబ్బులూ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ ప్రకటించినా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో.. ఎంత వస్తుందో తెలియడం లేదు. డీఏ బకాయిలు లక్షలాది రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదు. పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు చెల్లించడం లేదు. ఏడాదిగా పోలీసుల సరెండర్ లీవ్స్కి చెల్లింపులు చేయడం లేదని మండిపడ్డారు.
ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ మొత్తం రూ.3వేల కోట్లు ఉంటుందని వాటిని ప్రభుత్వం తీసుకుందని.. కానీ సమాధానం చెప్పడంలేదని విమర్శించారు. సీపీఎస్ ఉద్యోగుల వాటా రూ.1200 కోట్లు ఏమయ్యాయి? ఈ అన్యాయాలు ప్రజలందరికీ తెలియాలి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు అన్నారు.. ఏమైంది? ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేస్తే.. వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి మీరేం చేశారు? రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పాతపెన్షన్ విధానం అమలును సమీక్షించేందుకు తీసుకెళ్లి మళ్లీ ఎందుకు మాట మారుస్తున్నారు?సీపీఎస్ దుర్మార్గమని, అన్యాయమని మీరే చెప్పినా దాన్ని రద్దు చేయడానికి ఆలస్యమెందుకని ఆయన ప్రశ్నించారు. జీపీఎస్ విధానాన్ని మేం పూర్తిగా తోసిపుచ్చామని.. చర్చలకు కూడా రావట్లేదని చెప్పామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
రాజకీయ నేతలు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారని బొప్పరాజు ప్రశ్నించారు. ఆ విధానాన్ని మీరు రద్దు చేసుకోవాలని సవాల్ చేశారు. వయసు అయిపోయే వరకూ మీరేమైనా సేవ చేస్తున్నారా.. రాజకీయ నేతల రాయితీలు ప్రపంచంలో ఎవరూ పొందరు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 22 ఏళ్లుగా సర్వీసులో ఉన్నారు. క్రమబద్ధీకరణ చేస్తామని వారిని నమ్మించారు.. అందుకే ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ప్రతి ఉద్యోగీ ఎల్లుండి నుంచి ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఏపీ ఎన్జీవో జేసీ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. అన్ని సంఘాలు ఉద్యమంలో కలిస్తే ఉద్యోగుల ఆందోళనలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)