Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Ambati Rambabu farmhouse: అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో ఉన్న 22 ఎకరాల ఫాంహౌస్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా స్విమ్మింగ్ ఫూల్, లగ్జరీ ఇల్లు కట్టారని సర్వే చేయాల్సి ఉందని తెలిపారు.

Ambati Rambabu alleges that the government has targeted his assets: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఫాంహౌస్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన సర్వే నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు ఉన్న సుమారు 22 ఎకరాల పొలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆదేశాల మేరకు ఈ పొలాన్ని, అందులోని నిర్మాణాలను సర్వే చేయాల్సి ఉందని ఎమ్మార్వో కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఫాంహౌస్లో నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మించారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అంబటి స్వయంగా ఈ నోటీసుల విషయాన్ని ధృవీకరించారు.
రాజకీయ కక్షసాధింపేనన్న అంబటి
ప్రభుత్వ చర్యలపై అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తనపై భౌతిక దాడులకు దిగారని, ఇప్పుడు తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలాన్ని సర్వే చేయడం అంటే తన వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేయడమేనని ఆయన అభివర్ణించారు. రేపు మా ఇంటికి కూడా నోటీసులు ఇస్తారేమో అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. త
లీగల్గా కొన్న పొలమేనని స్పష్టీకరణ
ఈ 22 ఎకరాల పొలాన్ని తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తన దగ్గర దాచడానికి ఏమీ లేదని, తాను ఆ పొలాన్ని కొనే ముందే అందులో ఒక చిన్న బావి, పెంకుటిల్లు ఉన్నాయని వివరించారు. అధికారులు చెబుతున్నట్లుగా అక్రమ నిర్మాణాలు ఏవీ అక్కడ లేవని ఆయన వాదిస్తున్నారు. కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ స్వయంగా వచ్చి తన పొలాన్ని చూడవచ్చని, తనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సవాల్ విసిరారు. తాను మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పి వచ్చానన్నారు. అధికారం శాశ్వతం కాదని, కూటమి ప్రభుత్వం తనను భయపెట్టలేదని అంబటి రాంబాబు హెచ్చరిస్తున్నారు.
గత ఐదేళ్ల సంపాదనపై విమర్శలు
అంబటి రాంబాబు సొంత ఊరు రేపల్లె అయినప్పటికీ, ఆయన సత్తెనపల్లిలో భారీగా భూములు కూడబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ఐదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలోనే ఇన్ని ఎకరాల భూమిని ఎలా సంపాదించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కేవలం చట్టపరమైన విచారణే చేస్తోందని కూటమి నేతలు చెబుతుంటే.. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని అంబటి అంటున్నారు. ఆస్తులన్నీ సక్రమంగా ఉంటే అధికారుల సర్వేకు సహకరించకుండా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సర్వే తర్వాత ఈ 22 ఎకరాల భూమి చుట్టూ ఉన్న చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే మాజీ మంత్రికి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.























