Nara Lokesh: ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు - అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
AP Mega DSC Notification | ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు ప్రకటిస్తామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

అమరావతి: రాబోయే 5 ఏళ్లలో స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్ల కొనుగోళ్ల టెండర్లలో రాష్ట్ర ఖజానాకు 1000 కోట్లు ఆదా చేయబోతున్నామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టెండర్లలో పారదర్శక విధానాలను అమలుచేసి ఖజానాకు నిధులు ఆదా చేస్తున్నాం. ఒక్క చిక్కీల్లోనే 63 కోట్లు (36శాతం) ఆదా చేశాం, అయేదేళ్లలో రూ.300 కోట్లకు పైగా నిధులు ఖజానాకు ఆదా అవుతాయని నారా లోకేష్ వెల్లడించారు.
స్కూల్ కిట్లలో ఆదా, కోడిగుడ్లలో ఆదా
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కరిక్యులమ్ మార్పులు, మౌలిక సదుపాయాలపై అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. స్కూల్ కిట్స్ లో కూడా 8 నుంచి 9శాతం వరకు అంటే 70 కోట్లవరకు ఆదా అవుతుంది. కోడిగుడ్లలో కూడా 10నుంచి 12శాతం తగ్గింది. రేట్లు తగ్గించడంతోపాటు క్వాలిటీ మెయింటెన్ చేయాలని అధికారులకు చెప్పాను.
విద్యావ్యవస్థలో సంస్కరణల అమలుపై మేం దృష్టిసారించాం. స్కూల్ కిట్స్ లో థర్డ్ పార్టీతో మానిటరింగ్ పెట్టాం. టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు బరువుగా ఉన్నాయని పలువురు చెప్పడంతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, పుస్తకాల బరువు తగ్గించేందుకు మహారాష్ట్ర మోడల్ లో సెమిస్టర్ వారీ విధానం తెస్తున్నాం. స్కూలు కిట్స్ లో ఇంకా ఎక్కువ ఆదా అయ్యేది, కానీ యూనిఫాం నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో టూ సైడ్ ప్రింటింగ్ తో మంచి క్లాత్ ఇచ్చాం, ప్రస్తుత యూనిఫాం మరో ఏడాది కూడా వాడవచ్చు. అందువల్ల యూనిఫాంలో సేవింగ్స్ తగ్గింది.
ఈనెలలోనే మెగా డిఎస్సీ ప్రకటన
1994 నుంచి 2024వరకు డిఎస్సీల ద్వారా 2.53లక్షల టీచర్లను నియమించగా, టిడిపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నపుడు 71 శాతం అంటే 1,80,272 పోస్టులు భర్తీచేశాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సీ ఫైలుపై పెట్టారు, అందులో భాగంగా పారదర్శకంగా టెట్ కూడా నిర్వహించాం. టెట్ నుంచి నోటిఫికేషన్ (TET Notification) ప్రకటించేలోపు సమస్యలపై వన్ మ్యాన్ కమిషన్ కూడా వేయడంతో కొంచెం జాప్యమైంది. మార్చిలోనే 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం. 1994నుంచి ఇప్పటివరకు డిఎస్సీపై పడిన కేసులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. జిఓ 117 ప్రత్యామ్నాయంపై టీచర్ యూనియన్లతో అయిదున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించా. మన ప్రభుత్వం పరదాలు కట్టుకుని, 144 సెక్షన్ పెట్టి పాలించేది కాదు. చర్చలు జరిపిన సంఘాల్లో వైసిపి అనుబంధ సంఘం కూడా ఉంది. వాళ్లు లోపల ఏం మాట్లాడలేదు, అన్నీ బాగున్నాయని వెళ్లారు. అందరితో చర్చించి జిఓ 117 రద్దుచేసి, ప్రత్యామ్నాయం తెస్తాం.
పారదర్శకంగా సీనియారిటీ లిస్టు ప్రకటన
ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు పబ్లిష్ చేయబోతున్నాం. సాధారణంగా సీనియర్ లిస్టులు గందరగోళంగా ఉంటాయి. ఈసారి మేం ప్రకటించిన లిస్టులో తప్పులు ఉంటే డిఇఓ వద్దకు వెళ్లి సరిచేసుకోవచ్చు. వచ్చే కేబినెట్ కు టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ (Teacher Transfer Act) తెస్తాం. టీచర్ల బదిలీల్లో ఎవరివద్దకు పైరవీలకు వెళ్లాల్సిన పనిలేదు. లేనిపోని యాప్ లు, రాజకీయ జోక్యం వల్ల వారు విద్యార్థులకు సరిగా చదువు చెప్పలేకపోతున్నారు. గత ప్రభుత్వం పెద్దపెద్ద మాటలు చెప్పింది.
ఆత్మలతో మాట్లాడే మాజీ సీఎం..
మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఆత్మతో మాట్లాడటం ఇష్టం. ఆత్మలతో మాట్లాడి ఐబి, సిబిఎస్ఇ (CBSE), టోఫెల్ అంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఐబి స్కూళ్లు పెట్టకుండానే కేవలం రిపోర్టు తేవడానికి 5కోట్లు ఖర్చుపెట్టారు. టోఫెల్ అమలు చేయలేదు. సిబిఎస్ఇ మోడల్ మాక్ ఎగ్జామినేషన్ పెడితే 90శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో బాలికల ఫెయిల్ అయితే ఆ ప్రభావం సామాజిక సమస్యగా తలెత్తుతుంది. చదువు మధ్యలో ఆపేసి వారికి పెళ్లిళ్లు చేస్తారు. అందుకే టీచర్లు, తల్లిదండ్రులు, పిల్లలను సిద్ధం చేసి మూడేళ్ల తర్వాత సిబిఎస్ఇ అమలు చేద్దామని చెప్పారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేయడానికి వన్ క్లాస్ – వన్ టీచర్ ఉండాలని మేం భావిస్తున్నాం. ప్రతి పంచాయితీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం వన్ క్లాస్ – వన్ టీచర్ ఉన్న పాఠశాలలు కేవలం1400 మాత్రమే ఉన్నాయి. సంస్కరణల తర్వాత 10వేలకు పెరుగుతాయి.
మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు
కరిక్యులమ్ మార్పుల్లో ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం పెంచేలా చర్యలు చేపడుతున్నాం. 1,2 తరగతుల టెక్స్ట్ బుక్స్ లో ఇంటిపనుల ఫోటోల్లో మహిళలు, పురుషులు చెరిసగం ఉండేలా చేశాం. అన్నిపనుల్లో సమానమనే భావన రావాల్సి ఉంది. సినిమాల్లో కూడా ఇటువంటి మార్పు రావాలి. గాజులు తొడుక్కున్నారా, చీరకట్టుకున్నారా అనే మాటలు పోవాలి. గతంలో మంత్రులు కూడా చిన్నచూపుతో మాట్లాడారు. అటువంటివి పోతేనే సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రస్తుతం ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇంగ్లీషు, తెలుగు రెండూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎయిడెడ్ వ్యవస్థ గందరగోళంగా ఉంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం తేవాలని భావిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నాం.
ఎపి మోడల్ ఎడ్యుకేషన్.. నారా లోకేష్
టీచర్లు, పేరెంట్స్, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేసి రాబోయే మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి పరిచయం చేస్తాం. టీచర్ ట్రైనింగ్ కు వరల్డ్ క్లాస్ ఇనిస్టిట్యూట్ అమరావతిలో పెట్టాలని భావిస్తున్నాం. దీనిపై మంత్రి నారాయణతో చర్చించాం. ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి ఇక్కడకు ట్రైనింగ్ తీసుకునేలా ప్రతిష్టాత్మకమైన సంస్థను ఏర్పాటుచేస్తాం. సంస్కరణల అమలును ఈ ఏడాది జూన్ కల్లా పూర్తిచేస్తాం. నైతిక విలువలతో కూడిన విద్యావిధానానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందుకోసం ప్రముఖ ఆధ్యాత్మకవేత్త చాగంటి కోటేశ్వరరావు గారి నేతృత్వంలో నైతికతపై పాఠ్యంశాలు తయారవుతున్నాయి. లింగసమానత్వంపై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం నాడు పిల్లలకు అర్థమయ్యేలా బాల రాజ్యాంగం తయారుచేసి అందించాలని నిర్ణయించాం. వచ్చే నాలుగేళ్లు కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్ పై శ్రద్ధ పెట్టి, అందరి సహకారంతో ఎపి మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే దిశగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Also Read: Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం






















