Cyclone Montha Impact on AP: మొంథా తుపానుపై ఏపీ సన్నద్ధత, రూ.14 కోట్లు విడుదల.. జిల్లాలకు ప్రత్యేక అధికారులు
Cyclone Montha Latest News Updates | మొంథా తుపానుపై ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

Andhra Pradesh Rains | అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. అక్టోబర్ 28న మొంథా అనే తీవ్ర తుఫాను రూపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. మొంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తీర ప్రాంత జిల్లాలన్నింటికీ సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అధికారులు తక్షణమే తమ తమ జిల్లాలకు చేరుకొని సైక్లోన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, కలెక్టర్లతో సమన్వయంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ జిల్లాలపై తుపాను ప్రభావం అధికం..
ఆర్.పి. సిసోడియాను తూర్పు తీర ప్రాంతాల జోనల్ ఇన్చార్జిగా నియమించారు. సిసోడియా పశ్చిమ గోదావరి జిల్లా నుండి చిత్తూరు వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. అజయ్ జైన్కు శ్రీకాకుళం జిల్లా నుండి కోనసీమ జిల్లాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మొంథా తుఫాను ప్రభావం ఈ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇతర జిల్లాలకు కూడా సీఎస్ ప్రత్యేక అధికారులను నియమించారు. కె.వి.ఎన్. చక్రధరబాబు (శ్రీకాకుళం), పట్టణశెట్టి రవి సుబాష్ (విజయనగరం), నారాయణ భారత్ గుప్తా (పార్వతీపురం మన్యం), వదరేవు వినయ్ చంద్ (అల్లూరి సీతారామరాజు), వి.ఆర్. కృష్ణ తేజ (కాకినాడ), కె. కన్నా బాబు (తూర్పు గోదావరి), విజయరామరాజు (కొనసీమ), వి. ప్రసన్న వెంకటేశ్ (పశ్చిమ గోదావరి), కాంతిలాల్ డాండే (ఏలూరు), అమ్రపాలి కాటా (కృష్ణా), శశిభూషణ్ కుమార్ (ఎన్టీఆర్), ఎం. వేణుగోపాల్ రెడ్డి (బాపట్ల), కోనా సశిధర్ (ప్రకాశం), ఎన్ యువరాజ్ (నెల్లూరు), పి. అరుణ్ బాబు (తిరుపతి), పి.ఎస్. గిరీశా (చిత్తూరు)లను ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.
అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలి
ఈ అధికారులు మొంథా తుఫాను సమయంలో ఉపశమన, రక్షణ, సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలి. ప్రతి బాధిత కుటుంబానికి సాయం చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. తుఫాను అనంతరం నష్టం అంచనా, పరిహారం పంపిణీ, ప్రజల సాధారణ జీవన పునరుద్ధరణ వరకు ఈ అధికారులు సేవలు అందించనున్నారు. వీరు అన్ని శాఖల మధ్య (రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇంధనం, రోడ్లు & భవనాలు, నీటివనరులు, ఆరోగ్యం) సమన్వయంతో పనిచేయనున్నారు. అనుభవజ్ఞులైన అధికారులు సిసోడియా, అజయ్ జైన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రజలు మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అధిక వర్షపాతం నమోదైన మండలాల్లో ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు, అత్యవసర సదుపాయాలకు ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకుని అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.






















