Amaravathi Farmers Mahapadyatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతి లేదు - అర్థరాత్రి డీజీపీ ఉత్తర్వులు
Amaravati Farmers Mahapadyatra: అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గే అవకాశం ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Amaravati Farmers Mahapadyatra: అమరావతి రాజధాని రైతులు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒకటి అయిపోగానే మరొక కార్యక్రమాన్ని తీసుకొస్తూ.. తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతులను అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.
ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే..?
"మీరు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మహాపాద యాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందులో 200 మందికిపైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళ్తామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లా పోలీసుల అధికారులకు పంపించాం. దీనిపై అధికారులందరి అభిప్రాయాలను కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులు ఇస్తున్నానని".. ఈ ఉత్తర్వుల ద్వారా వెల్లడించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే అమరావతి రైతులు గతేడాది అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.
71 క్రిమినల్ కేసులు నమోదు..
అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. పాదయాత్రలో ఆ షరతులన్నీ ఉల్లంఘించారని.. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయ పరచడం, వారిని ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. అందుకు వివిధ జిల్లాల్లో అమరావతి రైతులపై 71 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రెండు కేసుల్లో శిక్ష కూడా పడినట్లు వివరించారు. అయితే ఇప్పుడు పాదయాత్రం కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆంక్షలు ఉన్నాయన్నారు. కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా పాదయాత్ర మార్గంలో ఉందని... చెప్పారు.
ఎంత మంది వస్తారో కూడా మీకు తెలీదు..
200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే.. ప్రజల సంఖ్య పెరిగితే బృందాలుగా చీలి వెళ్తామంటున్నారని వివరించారు. అసలు పాదయాత్రకు ఎంతమంది వస్తారన్న దానిపై వారికే నియంత్రణ లేదన్నది అర్థం అవుతోందని డీజీపీ వివరించారు. పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారనేది కూడా సరిగ్గా తెలియనప్పుడు... వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా కష్టమే అవుతుందన్నారు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందన్నారు. యాత్రలో మహిళలు కూడా పాల్గొంటారు కాబట్టి భద్రత కల్పించడం మరింత కష్టమవుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలోనే రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతి భద్రతల సమస్యగా మారి, మంత్రి, ఎమ్మెల్యేల ఇల్లు తగులబెట్టడం వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. అమరావతి రైతుల పాదయాత్ర మీదుగానూ సాగనుంది. కాబట్టి పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మహా పాదయాత్రకు అనమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















