CM Jagan Letter : ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించండి, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖలు
CM Jagan Letter : దేశంలో రోజు రోజుకీ పెరుగుతూ పోతున్న వంటనూనెల ధరలపై సీఎం జగన్ కేంద్రానికి లేఖరాశారు. రష్యా, ఉక్రెయిన్ కారణంగా వంటనూనెల ధరలు పెరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడానికి ఆవనూనెపై సుంకాన్ని తగ్గించాలన్నారు.

CM Jagan Letter : రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడిందని సీఎం జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, పీయూష్ గోయల్కు సీఎం జగన్ లేఖలు రాశారు. వంటనూనెలకు కొరత నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని సీఎం జగన్ అన్నారు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ను ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
ఉక్రెయిన్ , రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి
ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై చాలా ఎక్కువగా పడిందని సీఎం జగన్ లేఖల్లో పేర్కొన్నారు. దీనివల్ల సన్ఫ్లవర్తోపాటు, ఇతర వంటనూనెల ధరలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో మూడింట రెండొంతులమంది సన్ఫ్లవర్ వాడుతారని, పామాయిల్ 28 శాతం మంది, వేరుశెనగ నూనె 4.3 శాతం మంది వాడుతారన్నారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నాయని సీఎం జగన్ లేఖల్లో పేర్కొన్నారు. కొరత లేకుండా వంటనూనెలు సరఫరా చేయడానికి, రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీ చేసేవారితో క్రమం తప్పకుండా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆవాల నూనెలపై సుంకాలు తగ్గించండి
ఏపీ ఆయిల్ఫెడ్ ద్వారా రైతు బజారల్లో సరసమైన ధరలకే వంటనూనెలు విక్రయిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇతర వంటనూనెల వినియోగంపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆవాల నూనె కూడా సన్ఫ్లవర్ లానే ఉంటుందని, కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందన్న సీఎం.... ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధి చేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందన్నారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ఎక్కువగా ఉన్నాయని, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలని సీఎం కేంద్రమంత్రులను కోరారు. దీంతో వినియోగదారుల ఇబ్బందులు కొంత మేర తగ్గించగలమన్నారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















