Breaking News Live: సాగర్ కెనాల్ లో కారు బోల్తా... కారులో ఎమ్మెల్యే సోదరుడి కుటుంబం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర విషాదం చోటు చేసుకుంది. మున్నేరు వాగులో ఐదుగురు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. బాల ఏసు, చరణ్, అజయ్తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైన విషయం తెలిసి మునేటి ఒడ్డుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌసల్ ఆదేశాల మేరకు ఘటనా ప్రాంతంలోనే అధికారులు పంచనామాకు ఏర్పాట్లు చేశారు.
సెల్ ఫోన్ కోసం ఘర్షణ.. ఒకరి హత్య
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన ఇద్దరు కూలీలు సెల్ఫోన్ కోసం గొడవపడ్డారు. ఈ క్రమంలో భూక్య బీమా అనే 45 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి బండరాళ్లతో కొట్టి చంపి పారిపోయాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంగారం, వెండి ధరలు
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.64,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,300గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది వారాలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్లోనూ గత వారం రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (జనవరి 11) కూడా పాత ధరలే కొనసాగుతున్నాయి. పెట్రోల్ రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.10 పైసలు పెరిగి రూ.110.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు పెరిగి రూ.96.32 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.19 పైసలు తగ్గి రూ.110.29గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.20 పైసలు తగ్గి రూ.96.36 గా ఉంది.
గుంటూరు జిల్లాలో సాగర్ కెనాల్ లో కారు బోల్తా... కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగోప్పల గ్రామ పరిధిలోని సాగర్ మెయిన్ కెనాల్ లో కారు బోల్తా పడింది. కారులో పిన్నెల్లి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మదన్ మోహన్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సోదరుడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు.
సంకీస గ్రామంలో కరోనా కలకలం... 12 మంది అయ్యప్పస్వాములకు కరోనా పాజిటివ్...
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో పెరుమాండ్ల సంకీస గ్రామంలో కరోనా కలకలం రేగింది. పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన 12 మంది అయ్యప్ప స్వాములకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల శబరి యాత్ర చేసి 40 మంది స్వాములు గ్రామానికి తిరిగి వచ్చారు. వీరిలో 12 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గ్రామంలో వైద్యాధికారులు గ్రామస్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.





















