Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates : నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో వారంలో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి జూన్ 10లోపు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ లో
రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా వంగి ఉంది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి మరఠ్వాడా కర్ణాటక మీదగా సముద్రమట్టాలనికి 1.5కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీని ఫలితంగా ఏపీలో రాగల రెండు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో
తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలోని పలు ప్రాంతాలకు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులకు, అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
Nellore Crime: అన్నని కాపాడబోయి తమ్ముడు.. నెల్లూరులో సముద్ర తీరంలో తీరని విషాదం
అన్నని కాపాడబోయి తమ్ముడు.. నెల్లూరులో సముద్ర తీరంలో తీరని విషాదం..
వారిద్దరూ అన్నాదమ్ములు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో.. సరదాగా కుటుంబ సభ్యులతో కలసి బీచ్ కి వెళ్లారు. నెల్లూరు జిల్లాలోని కొత్తకోడూరు బీచ్ కి వెళ్లి కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం వరకు ఆనందంగా గడిపారు. అన్న ప్రణయ్ రెడ్డి సముద్రంలో కాస్త లోతు వరకు వెళ్లాడు. అతను మునిగిపోతుండటం చూసి తమ్ముడు ధనుంజయ్ రెడ్డి అన్నని కాపాడటానికి సముద్రంలోకి వెళ్లాడు. ఇలా ఇద్దరూ గల్లంతయ్యారు. చివరకు ఇద్దరూ దుర్మరణంపాలయ్యారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.
KCR Delhi Tour: ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్
KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ హస్తినకు పయనమయ్యారు. నేటి నుంచి 8 రోజులపాటు పలు రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించనున్నారు. పలు పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలతో అక్కడ సమావేశమవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులపైనా చర్చించనున్నారు.





















