Nizamabad: నిజామాబాద్లో వెలుగు చూసిన విశ్వకర్మ విగ్రహం
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం విశ్వకర్మ శిల్పం వెలుగులోకి వచ్చింది. గ్రామ శివాలయం ఆవరణలో ఓ చెట్టుకింద ఉన్న విగ్రహాన్ని పబ్లిక్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, చరిత్ర పరిశోధకుడు బోగ్గుల శంకర్ రెడ్డి గుర్తించారు. ఈ విగ్రహం శైలిని బట్టి చానక్య కాకతీయుల నాటిదని ప్రీహా ఉపాధ్యక్షుడు, శాసన పరిశోధకుడు సూర్యకుమార్ అభిప్రాయ పడ్డారు. విశ్వకర్మ విగ్రహాలు రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా అరుదుగానే లభించాయని అన్నారు.
విశ్వకర్మ విగ్రహం వద్ద మమ్మాయి దేవత ఉండటం శిల్పంలో ప్రత్యేకత అన్నారు. మమ్మాయి దేవత గుళ్లు తెలంగాణలో పెద్దపల్లి, ఇబ్రహీం పట్నం వంటి చోట్ల ఉన్నప్పటికీ విశ్వకర్మ, మమ్మాయి ఒకే శిల్పంలో ఉండటం ఇదే మొదటి సారి అని తెలిపారు. సుమారు రెండు అడుగుల పోడువు, రెండు అడుగులు వెడల్పు ఉన్నట్లు శంకర్ రెడ్డి తెలిపారు. లోహ, శిల్ప శాస్ర్తాల్లో ఆరితేరిన విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం విశ్వకర్మ విగ్రహం నిజామాబాద్ జిల్లాలో లభించటానికి కారణం ఈ ప్రాంతమంతా వేల ఏండ్లుగా ఇనుము, ఉక్కు పరిశ్రమల్లో నిమగ్నమై ఉండటమేనని ప్రీహా అధ్యక్షుడు డాక్టర్ పెదంబదూర్ జైకిషన్ తెలిపారు. మొదటి విశ్వకర్మ శిల్పాన్ని 2019లో వరంగల్ జిల్లా ముప్పారం డాక్టర్ హిందోళ వెలుగులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు.





















