YSRCP vs TDP Conflict in GVMC Council | జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ రగడ | ABP Desam
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరసనల మధ్య ప్రారంభమైంది. ఎటువంటి చర్చ లేకుండా 15 అంశాలను ఆమోదించడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం విద్యాసంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే అంశాన్ని అజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి, ప్లకార్ట్ లు పట్టుకొని మేయర్ పోడియంను చుట్టుముట్టారు వైయస్సార్సీపి కార్పొరేటర్లు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియం దెగ్గర పడుకొని మరి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేసారు. ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
గీతం విద్యాసంస్థల అంశంపై వైసీపీ రాద్ధాంతం వెనుక రాజకీయ కక్ష ఉందని పట్టాభి ఆరోపించారు. గత ఎన్నికలలో బొత్స సత్యనారాయణ సతీమణిని విశాఖ ఎంపీ భరత్ 5 లక్షల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారని, ఆ ఓటమిని జీర్ణించుకోలేకే ఇప్పుడు అదే అక్కసును గీతంపై వెళ్లగక్కుతున్నారని ఆయన విమర్శించారు. కోవిడ్ 19 క్లిష్ట సమయంలో గీతం సంస్థలు ఎంతో అద్భుతమైన వైద్య సేవలు అందించాయని అప్పట్లో ఇదే వైసీపీ నేతలు కొనియాడారని, ఇప్పుడు రాజకీయాల కోసం అదే గీతంపై విరుచుకుపడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. భరత్ ఒక రాజకీయనాయకుడు కాకుండా ఉంటే, అప్పుడు కూడా ఇలాగే అభ్యంతరం వ్యక్తం చేసేవారా? అని ఆయన ప్రశ్నించారు.























