Rains in AP Telangana: అల్పపీడనం ప్రభావంతో 3 రోజులు అక్కడ భారీ వర్షాలు - పిడుగులు పడే ఛాన్స్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

Rains in Telangana AP: బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ముఖ్యంగా ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం ఉంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 13 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధితో పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 9, 2022
నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
7 Day Mid-day forecast of Andhra Pradesh (in Telugu) dated 09.10.2022 pic.twitter.com/9byxb69IwZ
— MC Amaravati (@AmaravatiMc) October 9, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం ఏపీలో మొదలైంది. అల్పపీడనం వలన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారిజామున ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు జోరందుకుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై తక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి, ఏలూరు, పల్నాడు జిల్లాలలో నేడు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రాత్రి, అర్ధరాత్రి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు, కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.





















