Defecting MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి మరో రెండు నెలల గడువు- సుప్రీంను కోరిన తెలంగాణ స్పీకర్
Telangana: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ మరో 2 నెలల గడువు సుప్రీంకోర్టును కోరారు.

Telangana Speaker defecting MLAs Issue: తెలంగాణ అసెంబ్లీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు నిర్ణయించిన మూడు నెలల గడువు ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జూలై 31న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అంటి-డిఫెక్షన్ చట్టం కింద దాఖలైన పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశించింది. ఆరుగురు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు. మిగతా విచారణలకు మరో రెండు నెలల (8 వారాల) సమయం కోరుతూ సుప్రీంకోర్టును స్పీకర్ అభ్యర్థించారు
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి పది మంది ఫిరాయించారు. వీరిపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణలు జరుగుతున్నాయి. స్పీకర్ ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేల విచారణలు పూర్తి చేశారు. మిగతా ఆరుగురి విషయంలో షెడ్యూల్ విడుదల కాలేదు. జూలై 31న జస్టిస్ బెంచ్ జారీ చేసిన తీర్పులో ఎమ్మెల్యేలు విచారణను వాయిదా వేయకూడదు. మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి అని ఆదేశించింది. అక్టోబర్ 24 నుంచి చేసిన విచారణలు కూడా పూర్తి కాకపోవడంతో, స్పీకర్ మిగతా కేసులకు 'విస్తృత విచారణ అవసరం' అని చెబుతూ మరో 8 వారాల సమయం కోరారు. ఈ అభ్యర్థనపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరుపనుంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణోల వివాదాస్పదంగా మారింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కానీ సాంకేతికంగా వారు బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారు పార్టీ మారితే స్పీకర్ అనర్హతా వేటు వేయాల్సి ఉంటుంది. అయితే నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలన్నది స్పీకర్ ఇష్టం. గడువు లేదు. దీనిపై సుప్రీంకోర్టు.. స్పీకర్ కు మూడు నెలల గడువు పెట్టింది. విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. విచారణ నెమ్మదిగా సాగుతోంది. మొదట అందరికీ ..అంటే ఫిరాయించిన పది మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఎనిమిది మంది మాత్రమే వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. వారు ఇంకా గడువు కోరుతున్నారు.
మరోవైపు మిగతా ఎనిమది మంది మాత్రం తాము పార్టీ మారామని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశామని.. తాము పార్టీ మారలేదని.. చెబుతున్నారు. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని అంటున్నారు. వారు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో .. అసలు ఉపఎన్నికలు రాకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు గడువు ఇస్తే.. ఆ రెండు నెలల తర్వాత అయినా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.






















