Mining in Mailaram: మైనింగ్ వద్దంటూ రైతుల పోరు.. పోలీసుల అరెస్ట్తో గ్రామంలో ఉద్రిక్తత
‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో పోరుబాట పట్టిన కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త నెలకొంది.

Mining in Nagarkurnool District | ‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం ప్రజలు పోరుబాట పట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. మైలారంలోని గుట్టతో విడదీయలేని అనుబంధం ఉంది ఆ గ్రామస్థులకు. కానీ ఆ గుట్టపై ప్రభుత్వం మైనింగ్కు అనుమతివ్వడంతో మైలారం గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. కొంత కాలంగా నిరసనలు చేపడుతున్నారు. అక్కడి రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవడంతో.. అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే తమ గ్రామ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్లపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్ట్ చేసిన వారిని రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించారు. తమ గ్రామంలోకి పోలీసులు రాకుండా రోడ్లపై ముళ్ల కంచెలు వేసి ఆందోళన చేపట్టారు.
2021లో మైనింగ్కు అనుమతి.. అప్పటి నుంచి పోరుబాట
మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టను క్వార్ట్జ్ తవ్వకం కోసం 2021లో ఓ ప్రైవేటు సంస్థకు మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. తమ గ్రామ గుట్టపై మైనింగ్కు అనుమతులివ్వడాన్ని నిరసిస్తూ మైలారం గ్రామస్థుల అప్పటినుంచి పోరాడుతున్నారు. సదరు సంస్థ గుట్టపై మైనింగ్ చేపట్టేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అడ్డుకున్నారు. ‘గుట్టముద్దు ఓటువద్దు’ అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ను బహిష్కరించారు. 786 మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్కు దూరంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకూ దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
నివాసాలు కోల్పోతామని ఆందోళన
మైలారం గుట్టను ఆనుకుని 50 నుంచి 100కు పైగా నివాసాలున్నాయని.. గుట్టను తవ్వితే తాము ఇండ్లను కోల్పోతామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గుట్ట సమీపంలోనే ప్రభుత్వం నిర్మించనున్న ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం చెరువుకు ఆనుకునే ఉంది. మొత్తంగా గుట్టపై మైనింగ్ చేపడితే పర్యావరణ కాలుష్యం సహా ఊరికి నష్టం జరుగుతుందనేది ఆ గ్రామస్థుల వాదన.





















