Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా వర్షాలకు 6వేలకుపైగా ఎకరాల్లో పంట నష్టం- ప్రాథమిక అంచనాలపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వరద నష్ట నివారణ చర్యలపై కీలక ప్రకటన చేశారు. ప్రాథమికంగా సేకరించిన వివరాలు వెల్లడించారు.

Adilabad Latest News: తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన వరద నష్ట నివారణకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. "జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏర్పడిన వరద నష్ట నివారణపై అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి. జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైనందున వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాలు జలమయం అయ్యాయి, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్టులు, వంతెనలు, లో లెవెల్ వంతెనల వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయాయి. ప్రజానీకానికి కొంత ఇబ్బంది జరిగింది."
"వర్షాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 6 వేల 450 ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం జరిగింది. సుమారు 3 వేల 100 మంది రైతులు పంటలను నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పంట నష్టం, రైతుల వివరాలు నమోదు చేసి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని, సర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాటు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలి. జిల్లాలో పశు నష్టం, మేకలు, గొర్రెలు చనిపోయాయి. పశు వైద్యాధికారులు వాటి వివరాలతో నివేదిక రూపొందించి సమర్పించాలి, నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం" అని మంత్రి తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రహదార్లు త్వరగా రిపేర్లు చేపట్టాలని మంత్రి జూపల్లి అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని రహదారులు ధ్వంసం కావడం, అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిన చోట త్వరగా మరమ్మత్తులు చేపట్టి రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లు, గోడల వివరాలు అందించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ" గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని సిర్పూర్-టి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులను ఇతర గురుకుల పాఠశాలలకు తరలించడంతో ఇబ్బంది పడుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అడ్డు పడుతుందని, నిర్మాణాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి" అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ" వారం రోజులుగా కురిసిన భారీ వర్షం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. పంట నష్టం, రహదారులు, వంతెనలు, కల్వర్టుల మరమ్మత్తుల అంచనాలు రూపొందించి త్వరగా చర్యలు చేపడతాం. వరద పరిస్థితులలో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించా. ప్రజల తక్షణ సహాయం కోసం జిల్లా కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉన్నాం." అని తెలిపారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకు వచ్చినందున అభినందనలు తెలుపుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని వట్టి వాగు, కొమురం భీం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వట్టి వాగు కాలువలకు గండిపడి రైతుల చేనులలో నీరు రావడంతో పత్తి పంట నష్టపోయారని, రైతులను ఆదుకోవాలని తెలిపారు.

అంతకు ముందు ఆసిఫాబాద్ మండలం రాజురా గ్రామానికి వెళ్లే రహదారిలో లెవెల్ వంతెనను మంత్రి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామానికి చెందిన సిడాం గంగుకు చెందిన మేకలు వర్షాల కారణంగా మృత్యువాత పడటంతో 1 లక్ష 50 వేల రూపాయల పరిహారం బాధితులకు అందజేశారు.





















