Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Nizambad Politics | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజమాబాద్, కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

కామారెడ్డి: కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు నా మీద నోరు వేసుకొని పడిపోతారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మండిపడ్డారు. కామారెడ్డిలో జాగృతి జనం బాటలో భాగంగా కవిత మాట్లాడుతూ.. మా కుటుంబం ఉద్యమం, రాజకీయం అనే కమిట్ మెంట్ ఉన్న కుటుంబం అని అన్నారు. ప్రజలను, కుటుంబాన్ని వేర్వేరుగా చూసే పరిస్థితి లేదని, అయితే నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారని ఆమె బాధ వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చని, కానీ తాను మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డానని, తెలంగాణ అనే మరో కుటుంబం తనకు ఉందని, వారి కోసం ధైర్యంగా పనిచేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
బీసీ డిక్లరేషన్ ఇక్కడే ఇచ్చింది..
ఇక కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని కవిత గుర్తుచేశారు. ఇక్కడి నాయకులు చెబితే నమ్మరని కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యను తీసుకొచ్చి హామీలు ఇప్పించిందని, కానీ అదే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆమె విమర్శించారు. అయినప్పటికీ ప్రజలు వారి మాటలు నమ్మి గెలిపించారని, ఈ విషయమై ఎవరూ అడగరని కాంగ్రెస్ భావిస్తుందేమోనని, తాము జాగృతి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో పూలే విగ్రహం, సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని మహిళా టీచర్ దినోత్సవం చేసేలా తాము కృషి చేశామన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశామని, తమ పోరాటం ఫలితంగా మూడు బిల్లులు అడిగితే రెండు బిల్లులు తెచ్చారని, కానీ ఆ రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయని తెలిపారు. ఆ తర్వాత తాము రైల్ రోకో చేస్తామని వార్నింగ్ ఇస్తే మళ్లీ ఆర్డినెన్స్ తెచ్చారని, కానీ ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్దే ఆగిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లతో కొట్లాడుతూనే ఉంటామని, బీసీ రిజర్వేషన్ల సాధనలో జాగృతి ముందుంటుందని కవిత ప్రకటించారు.
బీసీలకు మంత్రి పదవి లేదు, బడ్జెట్ ఇస్తలేరు..
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామని ప్రకటించి, దాని జోలికి కూడా పోలేదని విమర్శించారు. నాయి బ్రాహ్మణులు, రజకులకు ఇచ్చిన ఫ్రీ కరెంట్ బంద్ పెట్టారని, 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు గానీ, ఇప్పుడు ఫీజు చెల్లించకపోవడంతో బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు బాధ పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్నారు, తాము హైదరాబాద్లో పోరాటం చేసి 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా చేశామని పేర్కొన్నారు. బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్లతో బడ్జెట్ పెడతామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలో బీసీలకు 9 వేల కోట్లే బడ్జెట్ పెట్టిందని, అందులో సగం మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.
రెండో ఏడాది 11 వేల కోట్లు బడ్జెట్ పెట్టినా కనీసం పావు వంతు కూడా ఖర్చు చేయలేదని, కనీసం రాజీవ్ యువ వికాసం లోనైనా పెద్ద ఎత్తున బీసీలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎంబీసీలకు కార్పొరేషన్ అన్నారు, దాని ఊసే లేదని, అన్ని కులాలకు ఫెడరేషన్లు అని చెప్పి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారిని బీసీ ద్రోహిగా తాము ఇప్పటికే ప్రకటించామని, ఆయన ఇప్పటి వరకు కూడా ప్రధాని మోడీకి ఈ అంశంపై ఒక్క లేఖ రాయలేదని, అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లలేదని విమర్శించారు. ఢిల్లీలో మాత్రం రెండు సార్లు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ కూడా రాలేదని, వాళ్ల ధర్నాల కారణంగా నెట్ రిజల్ట్ జీరో ఉందని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు ఆపి రిజర్వేషన్లు సాధించిన జయలలిత
తమిళనాడులో జయలలిత 9 ఏళ్లు ఎన్నికలను ఆపి రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేస్తూ, ఇంత అర్జెంట్గా పంచాయితీ ఎన్నికల అవసరమేముందని కవిత ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు రావనుకుంటే దాని గురించి వారితో మాట్లాడాలని, కాంగ్రెస్కు బీసీలకు న్యాయం చేయాలనే తపన లేదని, అందుకే ఇంత తొందరగా ఎన్నికలు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీల పరంగా సీట్లు అంటే కాంగ్రెస్ ఇచ్చిన చోటే బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు సీట్లు ఇస్తుందా అని ప్రశ్నిస్తూ, ఏదో ఇచ్చినట్లు ఇచ్చి వారిని ఓడగొట్టాలన్న కుట్ర అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే యాకుత్పుర సీటును బీసీకి ఇచ్చి ఓడగొట్టారని ఆమె విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరికన్నా మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అని, ఆ రెండు పార్టీలను తాము నిలదీస్తూనే ఉంటామని కవిత ప్రకటించారు.
కామారెడ్డి, నిజామాబాద్కు ఒక చుక్క నీళ్లు రాలేదు
కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 ద్వారా కామారెడ్డికి నీళ్లు ఇచ్చేందుకు ప్లాన్ చేశారని, అందుకు రూ. 1446 కోట్లు అవసరమైతే రూ. 450 కోట్లు మాత్రమే ఇచ్చారని కవిత తెలిపారు. మొత్తం 1500 ఎకరాల భూమి అవసరమైతే రెండో వంతు భూసేకరణ కూడా చేయలేదని, దీంతో కాళేశ్వరంతో కామారెడ్డికి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని, నిజామాబాద్కు కూడా కాళేశ్వరం నీళ్లు రాలేదని విమర్శించారు. ఒక్క సీజన్లో మాత్రమే హల్ది వాగు ద్వారా నీళ్లు ఇచ్చారని, కొండం చెరువు కెపాసిటీని తగ్గించారు కానీ ప్రాజెక్ట్ వ్యయం మాత్రం తగ్గించలేదని అన్నారు. కాళేశ్వరం 21, 22 ప్యాకేజీల కారణంగా ప్రజలకు మేలు జరగలేదని, కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు పోయాయని ఆరోపించారు. ప్యాకేజ్ 21, 22 కింద కాలువ డిజైన్కు వేల ఎకరాలు భూసేకరణ అవసరమైందని, అయితే భూసేకరణ ఎక్కువ లేకుండా డిజైన్లు మార్పించామని, ఫైప్డ్ వాటర్ను చెరువుల ద్వారా సప్లయ్ చేసే ప్రయత్నం చేశామని, కానీ ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం నీళ్లు రాలేదని ఆమె వివరించారు. ఒక ప్రభుత్వం చేపట్టిన పనులు ఇంకో ప్రభుత్వం కొనసాగించాలని, కాళేశ్వరం పనులు కొనసాగించకపోతే కామారెడ్డికి వేరే ఏ మార్గంలో నీళ్లు తెస్తారో ప్రభుత్వం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం పరితపించామని, 'ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు' అన్నట్లు అప్పుడు పనిచేశామని అన్నారు. రాష్ట్రం వచ్చాక కూడా ప్రజలు బాగుండాలని తాము చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తమకు ఒక్కటే చెప్పేవారని, ఒక రాష్ట్రం అస్తిత్వం, సంస్కృతికి వైభవం పోతే తిరిగి సాధించుకోవటానికి చాలా ఏళ్లు పడుతుందనే వారని, అందుకే తాము తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని కాపాడేందుకు పోరాటం చేశామని చెప్పారు. అదే సమయంలో రాజకీయాల గురించి కూడా మాట్లాడామని, మన దేశంలో ఏ మార్పు రావాలన్నా రాజకీయాల ద్వారానే సాధ్యమని, అందుకే రాజకీయాలను ప్రభావితం చేస్తూ ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని కవిత అన్నారు.
ఎన్నికల కోడ్తో పర్యటనలో మార్పులు
జనం బాటలో భాగంగా ఇప్పటి వరకు 11 జిల్లాలు తిరిగామని, ఇంకా 21 జిల్లాలు పర్యటిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ రావటంతో కామారెడ్డి పర్యటన తర్వాత జనం బాటలో స్వల్ప మార్పులు ఉంటాయని, హైదరాబాద్, మేడ్చల్లో తమ పర్యటన కొనసాగుతుందని తెలిపారు. కామారెడ్డి పర్యటనలో భాగంగా జుక్కల్ లో నాగమడుగు, నిజాం సాగర్, నాగిరెడ్డి, లింగంపేట్ ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటికి పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామని కవిత అన్నారు.
వర్షాలతో నష్టపోతే సాయం చేయలేదు..
గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు మొత్తం కామారెడ్డి నీట మునిగిందని, దీంతో చాలా మంది ఇళ్లు కోల్పోయారు. వరి, పత్తి, సోయా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని, 94 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో వర్షాలు పడితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సెప్టెంబర్ 4న పర్యటనకు వచ్చారని, వచ్చి వరదల కారణంగా చనిపోయిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామని, దెబ్బ తిన్న పంటలు, పశువులు, ఇళ్లకు సంబంధించి పరిహారం ఇస్తామన్నారు. మళ్లీ 15 రోజుల్లో రివ్యూ కూడా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారని, కానీ 4 వందల ఇళ్లకు మాత్రమే 11 వేలు తక్షణ సాయం చేశారని, మిగతా వారికి ఒక్క పైసా కూడా రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారని, కానీ కొండగల్ మీద చూపిన ప్రేమ కామారెడ్డి పై చూపటం లేదని, ఎందుకు కామారెడ్డిపై శీతకన్ను వివక్ష చూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. లింగంపల్లి- కామారెడ్డి బ్రిడ్జి కొట్టుకుపోతే రెండు నెలలు పట్టించుకోలేదని, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించారు.. కానీ ఏం లాభం
కామారెడ్డిలో వరద బురదకు కారణమైన వాళ్లు గతంలో బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లారని, దీంతో అప్పుడు, ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటలేరని అన్నారు. హైడ్రా లాంటి సంస్థ ఇక్కడ కూడా పెట్టి బురద శుభ్రం అయ్యేలా చూడాలని సీఎంను కోరారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత వెంకట రమణారెడ్డి ఏకంగా ఇద్దరు సీఎంలను ఓడించారని, కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఏమీ పనిచేయటం లేదని విమర్శించారు. కామారెడ్డికి వరదలు వస్తే బీజేపీ వాళ్లు పరేడ్ చూసినట్లు చూశారని, వాళ్లకు మన కష్టం పరేడ్ లాగా కనిపిస్తోందని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదని అన్నారు. గుజరాత్, బీహార్లో వరదలు వస్తే కోట్ల రూపాయలు సాయం చేశారని, కామారెడ్డిలో మాత్రం వరదలు వస్తే పైసా ఇవ్వలేదని, బీజేపీకి తెలంగాణ అంటేనే పట్టదన్న విషయం ఈ సంఘటన ద్వారా తెలుస్తోందనన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గెలిచేందుకు ఆపద మొక్కులు చాలా చెప్పారని, ఇప్పుడు అవి అడిగితే మీ ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి వస్తుందనన్నారు. కనీసం ప్రజల కోసం సీఎంతో పోరాటం చేయాలని, బీజేపీ ద్వారా నిధులు వచ్చేలా చేయాలని, కాంగ్రెస్తో కొట్లాడాలని, ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారని కవిత ప్రశ్నించారు.






















