Basara Temple Master Plan: రూ.225 కోట్లతో బాసర సరస్వతి ఆలయం పునర్ నిర్మాణం.. 9 అంతస్తుల రాజగోపురం, ఈశాన్యాన కోనేరు
Basara Temple Reconstruction Project | దక్షిణ భారత్లో ఏకైక జ్ఞాన సరస్వతి క్షేత్రమైన బాసర ఆలయం త్వరలో నూతన శోభను సంతరించుకోబోతోంది. ఆలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ. 225 కోట్లను కేటాయించింది.

దక్షిణాది రాష్ట్రాల్లోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన బాసర క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం.. కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో భక్తులను మరింతగా ఆకట్టుకోనుంది. వేల ఏళ్ల ఘన చరిత్ర ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (Basara Temple) పునః నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. బాసర ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం ఎ.రేవంత్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 6న) భూమి పూజ చేయనున్నారు.
దక్షిణ గంగగా గుర్తింపు పొందిన గోదావరి నదీ తీరంలోని బాసరలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి, మహా కాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది.
అక్షరాభ్యాసాలతో...
జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొంటుంది. ప్రాచీన ఆలయం కావడం.. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
శృంగేరి పీఠాధిపతుల నుంచి అనుమతి
బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారు. రాజ గోపురం, ఇతర గోపురాలు, గర్భాలయం, అర్ధ మండపం, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల నుంచి అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా నిర్మాణం..
భక్తుల సంఖ్యతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు.
శిలా నిర్మాణాలు...
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6 వేల మంది భక్తులకు అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంట శాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, ఆలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్టాప్తో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తారు.
పుష్కరాలకు వచ్చే వారికి ఏర్పాట్లు...
గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభంకానున్నాయి. పుష్కరాల సమయంలో భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ప్లాన్లో భాగంగా చేపట్టనున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
























