Munugode By Elections: మునుగోడు మాజీ ఎన్నికల అధికారిపై వేటు! ఈసీ తక్షణ ఆదేశాలు
Munugode By Elections: మునుగోడు మాజీ ఎన్నికల అధికారి కేఎంవీ జగన్నాథరావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసిది. డీఎస్పీపైన కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Munugode By Elections: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథ రావును తక్షణమే సస్పెండ్ చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసిది. భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా లేని అధికారాన్ని వినియోగించి మునుగోడులో ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును జగన్నాథరావు మార్చడం గతంలో వివాదంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. విచారణ నిర్వహించి పంపిన నివేదిక మేరకు ఎన్నికల బాధ్యతల నుంచి కేద్ర ఎన్నికల సంఘం ఆయనను తప్పించి వెంటనే అప్పట్లో మరో అధికారిని నియమించింది.
తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తక్షణమే ఆయన సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఉత్తర్వులను జారీ చేసి శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా దిల్లీ పంపాలని ఆయన తెలిపారు. ఎన్నికల అధికారికి తగినంత భద్రత కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత డీఎస్పీని బాధ్యుడిని చేయమి పేర్కొన్నట్లు వివరించారు. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలన్నారు.
అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వికారస్ రాజ్ వివరించారు. ఎన్నికల నియామావళిని, వ్యయ నిబంధనలను అతిక్రమించినా, రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడినా సీవిజిల్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు వచ్చిన వంద నిముషాల్లో అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుని చర్యలు తీసుకుంటారు. 739 పోస్టల్ బ్యాలెట్లకుగాను గురువారం వరకు 624 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన 21 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. రూ.2.95 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ శాఖ ఇప్పటి వరకు 123 కేసులు నమోదు చేసిందని వికాస్ రాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మునుగోడు ఉపఎన్నికకు ఈసీ ప్రత్యేక చర్యలు..
మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉపఎన్నిక కోసం ముగ్గురు పరిశీలకులను రంగంలోకి దించింది. సాధారణ పరిశీలకునితోపాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్ను ఈసీ నియమించింది. ఈయన శుక్రవారం అంటే 14వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు మునుగోడులో బాధ్యతలు నిర్వర్తిస్తారు.
పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్గఢ్కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమించారు. పోలీసు పరిశీలకుడు ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ 3వ తేదీ వరకు మునుగోడు ఉపఎన్నికక కోసం విధులు నిర్వర్తిస్తారు. నవంబర్ మూడో తేదీన పోలింగ్ నిర్వహించగా.. నవంబర్ 6వ తేదీన కౌంటింగ్ చేయబోతున్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















