ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, అడ్డువచ్చిన వారిని వదలనని అన్నారు. నల్లగొండ ప్రజలను ఆ కంపు నుండి కాపాడుతానని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 ఏళ్ల బీజేపీ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు నల్గొండ బహిరంగ సభలో సవాల్ విసిరారు.

- నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన, ప్రాజెక్టుల పూర్తికి హామీ ఇచ్చారు.
- బీఆర్ఎస్ అప్పులు, అమరవీరుల త్యాగాలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
- కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం పథకాలిచ్చింది.
- సీఎం పాలనపై అసెంబ్లీ చర్చకు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
నల్లగొండ: తెలంగాణ సాధనలో మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారి త్యాగాల ముందు బీఆర్ఎస్ నేతల త్యాగాలు ఎందుకూ పనికిరావని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఎవడు అడ్డు వచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేసితీరుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.వచ్చే ఎన్నికల్లోగా ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మూసి నది ప్రక్షాళనకు ఎవరు అడ్డొచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు.
నల్లగొండలోని నాగార్జున కాలేజీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకుముందు ఆయన నల్లగొండ జిల్లాలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో 2028 నుండి 2034 వరకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య వంటి అమరవీరుల త్యాగాలను అడ్డం పెట్టుకుని, ఉద్యమం ముసుగులో గత బీఆర్ఎస్ పాలకులు ఫాం హౌజ్ పాలిటిక్స్ చేశారని దుయ్యబట్టారు. 2014లో 60 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులను 6 లక్షల కోట్ల అప్పులపాలు చేసింది బీఆర్ఎస్సేనని విమర్శించారు. ఆ దోపిడీ దొంగతనాల్లో భాగస్వామ్యులైన వారే మళ్లీ పదవుల కోసం ఆశపడుతున్నారని, కానీ బీఆర్ఎస్ అనేది ఇక గతం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులను తాము రాజకీయంగా ఉప్పు పాతర వేశామని, వారిని మళ్లీ మొలవనివ్వబోమని స్పష్టం చేశారు. సూర్యాపేటలోని మూడు అడుగుల నాయకుడిని మళ్లీ అసెంబ్లీలోకి రానివ్వబోమని అక్కడి యువతే అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమం, అభివృద్ధిపై సవాల్
తెలంగాణలో తమ రెండున్నరేళ్ల పాలనతో పాటు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల బీజేపీ కేంద్ర పాలనపై, వారి మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిద్దామని, దీనికి సిద్ధమా? అంటూ విపక్షాలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లపాటు మహిళలకు క్యాబినెట్లో చోటే ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా.. గతంలో బర్లకు పోసిన దొడ్డు బియ్యం స్థానంలో, ఏటా 16 వేల కోట్లు ఖర్చు చేస్తూ 3 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఒట్టు వేసి చెపుతున్న...
— Congress for Telangana (@Congress4TS) June 28, 2026
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా...
మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డు వచ్చినా మూసీలో వేసి తొక్కుతా..#RevanthReddy #Telangana pic.twitter.com/2f5j5XwcFB
ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కే సిలిండర్
పేదవారి ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాల కడుపు మండుతోందని, వాళ్లు మాత్రం వందల ఎకరాల్లో వందల కోట్లతో ఫాం హౌజ్లు కట్టుకోవచ్చా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, రైతు భరోసాతో అన్నదాతల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న తెలంగాణలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇప్పటివరకు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని వెల్లడించారు. ఎస్సీ (SC) కులాల వర్గీకరణను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు.
నల్గొండ ప్రాజెక్టులు, మూసి ప్రక్షాళనపై కీలక ప్రకటనలు
గత బీఆర్ఎస్ పాలకుల పాపాల వల్లే ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టు వెనుకబడిందని, నల్లగొండ ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల లోపే ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel), డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని మాటిచ్చారు. మూసి నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి, ఆ కంపు నుండి నల్లగొండ బిడ్డలను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఈ ప్రక్షాళనకు ఎవడు అడ్డు వచ్చినా మూసిలోనే తొక్కుతామంటూ హెచ్చరించారు. సింగరేణిలో టెండర్లు కాలేదని, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Frequently Asked Questions
మూసీ నది ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు?
ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది?
వచ్చే ఎన్నికలలోపు ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన పాపాల వల్లే SLBC ప్రాజెక్టు ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఏ సవాల్ విసిరారు?
కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ, తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రమ్మన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు ఏమిటి?
పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. 3 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు























