![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR Karimnagar Tour : అకాల వర్ష బాధిత రైతులకు భారీ సాయం - గురువారం కరీంనగర్లో కేసీఆర్ ప్రకటించే అవకాశం !
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కేసీఆర్ పరిహారం ప్రకటించనున్నారు. గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
![KCR Karimnagar Tour : అకాల వర్ష బాధిత రైతులకు భారీ సాయం - గురువారం కరీంనగర్లో కేసీఆర్ ప్రకటించే అవకాశం ! KCR will announce compensation for the farmers who were damaged due to untimely rains. KCR Karimnagar Tour : అకాల వర్ష బాధిత రైతులకు భారీ సాయం - గురువారం కరీంనగర్లో కేసీఆర్ ప్రకటించే అవకాశం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/22/01dc18e57206592af1b0dc7b398ad8211679483040025228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KCR Karimnagar Tour : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యించనున్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన తో జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. సీఎం కేసీఆర్ స్వయంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. సీఎం రాక కోసం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ వద్ద హెలిఫ్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు... రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. బందోబస్తు ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం
మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టం వివరాలను తెలుసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ, ఉద్యానవన, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. వరిపైర్లు సుంకు దశలో ఉండటంతో అనేక ప్రాంతాల్లో సుంకురాలిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యం త్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా అకాల వర్షం రైతులకు తీవ్రంగా ముంచేసింది. వడగళ్ల వానకు భారీగా నష్టపోయారు రైతులు. మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో, అక్కడక్కడా వరి, కూరగాయలు వేసిన అన్నదాతలకు కోలుకోలేని బాధను మిగిల్చాయి ఈ వానలు. దారుణంగా దెబ్బతిన్న రైతులను ఇప్పటికే మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల నేతలు పరామర్శించారు.
రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న విప్కష నేతలు
అకాలవర్షాలకు పంటనష్టాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వానికి లేఖలు రాశారు. నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవలాని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అకాల వర్షంతో రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు అకాల వర్షానికి బాగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. నష్టపోయిన పంటల నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రైతులకు పంట నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు.
పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రులు
మరో వైపు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి రైతులకు భరోసా ఇస్తున్నారు. అధైర్య పడవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ పర్యటనలో రైతులకు భారీ సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)