Karimnagar Mayor Election: కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకున్న బీజేపీ.. మేయర్గా కొలగాని శ్రీనివాస్
చివరివరకూ ఉత్కంఠరేపిన కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించి కార్పొరేషన్ దక్కించుకుంది.

Karimnagar Mayor Election | కరీంనగర్ మున్సిపల్ పాలిటిక్స్లో అనూహ్య పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ (BJP) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మేయర్ ఎన్నికల ప్రక్రియలో హైడ్రామా చోటుచేసుకోగా, చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కూటమి నుండి బీఆర్ఎస్ బయటకు రావడం, మెజారిటీ ఓటింగ్ ప్రక్రియలో బీజేపీ తన పట్టును నిరూపించుకోవడంతో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరమయ్యేలా చేసి బీజేపీకి విజయాన్ని అందించారు.
కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్..
కరీంనగర్ కార్పొరేషన్కు మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్రావు పేర్లను బీజేపీ ప్రకటించింది. దాంతో వీరే మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. ఎన్నికకు హాజరైన సభ్యులలో నిర్ణీత 51 శాతం ఓట్లను సాధించి బీజేపీ అభ్యర్థి మేయర్గా విజయం సాధించారు. ఈ గెలుపుతో బీజేపీ కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్త రాజకీయ శకానికి తెరలేపింది. మరోవైపు నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ (34 సీట్లు) రాలేదు. కానీ, అత్యధిక స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీ తమ సంఖ్యాబలంతో మేయర్ ఎన్నకల్లో విజయం సాధించింది.
పార్టీల వారీగా సీట్ల వివరాలు:
బీజేపీ (BJP) 30
కాంగ్రెస్ (INC)14
బీఆర్ఎస్ (BRS)09
స్వతంత్రులు (Independents) 08
ఎంఐఎం (AIMIM) 03
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)02
మొత్తం స్థానాలు 66
























