Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Jubilee Hills MLA: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమించింది. కిడ్నీ సమస్యలతో ఆయన ఏఐజీలో చికిత్స పొందుతున్నారు.

Jubilee Hills MLA Maganti Gopinath: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్గాలు కానీ.. గోపీనాథ్ కుటుంబసభ్యులు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రొటీన్ చెకప్ కోసం వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ రెగ్యులర్ గా యశోదా ఆస్పత్రికి మాత్రమే వెళ్తారు. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లడానికి కారణం వైద్య పరీక్షలు కాదని గోపీనాథ్ ను పరామర్శించడానికని తెలుస్తోంది.
మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్య
మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సమస్యను నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదయిపోయింది. నాలుగు రోజుల కిందట తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో కుటుంబబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఏఐజీ ఆస్పత్రి స్పందించలేదు. ఎమ్మెల్యే అనారోగ్యం అంశాన్ని గుట్టుగానే ఉంచాలని అనుకోవడంతో కుటుంబసభ్యులు కూడా ప్రకటించలేదు. బయటకు సమాచారం లీక్ అయినందున హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన గోపీనాథ్
మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా ముఫ్పై ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు. యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014లో ఆయనకు మొదటి సారిగా టీడీపీ టిక్కెట్ జూబ్లిహిల్స్ నుంచి లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన పది వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి మళ్లీ 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. జూబ్లిహిల్స్ నుంచి గత ఎన్నికల్లో అజరుద్దీన్ పై విజయం సాధించారు.
గోపీనాథ్ ఆరోగ్యంపై అధికారికంగా చెప్పని కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ వర్గాలు
ఈ మధ్య కాలంలో గోపీనాథ్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది.దాదాపుగా అన్ని చోట్లా గెలిచింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగా చురుకుగా పాల్గొనలేపోయారని భావిస్తున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ ఎవరితోనూ పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదని అంటున్నారు. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని త్వరలోనే బయటకు వస్తారని.. బీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

