Land Regularisation Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక అప్డేట్, ఆఫీసుల నుంచి దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్
Layout Regularisation Scheme In Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక అప్డేట్ ఇచ్చారు. సంబంధిత జోనల్ ఆఫీసుల నుంచి దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్ వస్తాయని తెలిపారు.

హైదరాబాద్: అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS Scheme)కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 25 శాతం రాయితీ సైతం కల్పిస్తూ దరఖాస్తులకు ఆహ్వానించింది. ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సాయం చేస్తోంది.
జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల నుంచి ఫోన్ కాల్స్
అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. అన్నీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు అధికారులు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీ LRS దరఖాస్తును ఆమోదిస్తున్నాం, ఆఫీసుకు వచ్చి రెగ్యులరైజేషన్ కోసం ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారు. మార్చి 31లోపు అనుమతి లేని లేఅవుట్ల ప్లాట్లు క్రమబద్ధీకరణ కోసం నగదు చెల్లించే వారికి తెలంగాణ ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించింది. దాంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి దరఖాస్తుదారులకు కోసం హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. సంబంధిత జోనల్ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్కులను సంప్రదించాలని ఇలంబర్తి తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తొలిసారి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి, అవి వేర్వేరు దశల్లో పెండింగ్ లో ఉన్నాయి. అర్హమైన దరఖాస్తులకు ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రయోజనం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై 25 శాతం రాయితీ
అక్రమ లేఅవుట్లపై తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. మార్చి 31 లోపు క్రమబద్దీకకరణ చేసుకున్న వాళ్లకు 25 శాతం రాయితీ సైతం ప్రకటించింది. నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించారు. అనుమతి లేని లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని గత నాలుగైదు ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకునే వారికి రాయితీ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సిటీలో జోన్ల వారీగా దరఖాస్తులు
చార్మినార్ - 15,292
ఎల్బీనగర్ - 40,383
ఖైరతాబాద్ - 5,773
కూకట్ పల్లి - 22,901
శేరిలింగంపల్లి - 18,721
సికింద్రాబాద్ - 4,795
మొత్తం - 1,07,865
ఎల్ఆర్ఎస్ మొత్తం దరఖాస్తుల వివరాలిలా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 31, 2020 నుంచి అక్టోబర్ 31, 2020 వరకు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను సీకరించింది. ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నాలుగన్నరేళ్లు గడిచినా ఈ దరఖాస్తులు పరిష్కారం కాలేదు. మొత్తం 25.70 లక్షల LRS దరఖాస్తుల్లో హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో 3.58 లక్షలు రాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో 1.07 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి నుంచి 1.35 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని గత ఏడాది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.






















