Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల - 9 రోజుల్లో 9 వేల కోట్లు జమ- రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం కీలక వ్యాఖ్యలు
Rythu Bharosa In Telangana:తెలంగాణ రైతులకు, ప్రజలకు చేసిన మంచిన ప్రతి గ్రామంలో సభలు పెట్టి చెబుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Rythu Bharosa In Telangana:తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 9 రోజుల్లో 9 వేల కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తోంది. రైతునేస్తం వేదికగా బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉండాలన్నారు. గతంలో పదవులు అనుభవించినవాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి నాటకాలకు బయలుదేరారు అని విమర్శించారు.
పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారని బీఆర్ఎస్పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లైనా కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి అప్పగించారని ఆరోపించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.
వరి వేసుకుంటే ఉరే అని నాటి ప్రభుత్వం చెప్పిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత తమదని తాము చెప్పినట్టు వెల్లడించారు. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించామన్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా రైతులకు మద్దతుగా ఉంటున్నామని తెలిపారు. సన్న వడ్లు పండించడం వల్లే పేదలకు సన్నంబియ్యం అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కితాబు ఇచ్చారు.
రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు ఇంతకంటే ఇంకేం కావాలని అభిప్రాయపడ్డారు. పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారని కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. అప్పులు నెత్తిపై పెట్టి ఇవాళ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు.
18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని రేవంత్ గుర్తు చేశారు. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదామని రేవంత్ పిలుపునిచ్చారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితి కల్పించామని తెలిపారు. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కొంత కాలమైనా సమయం ఇవ్వరా..? సరిదిద్దుకొనివ్వరా? అంటూ ప్రశ్నించారు.
భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని తెలిపారు. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. ప్రజల భవిష్యత్ బాగుంటేనే తమకు ఆనందంగా ఉంటుందన్నారు రేవంత్. ఆ దిశగా రైతులను తీర్చిదిద్దడమే కర్తవ్యమని వెల్లడించారు. రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
రైతులు పంట మార్పిడి చేయండని రేవంత్ సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గులేకుండా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.





















