Justice NV Ramana: మధ్యవర్తిత్వ ప్రక్రియే ఉత్తమ పరిష్కార మార్గం: జస్టిస్ ఎన్వీ రమణ
Justice NV Ramana: హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ లో నిర్వహించిన ఇండియా మీడియేషన్ డేలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు.

Justice NV Ramana: ప్రస్తుత సమయంలో సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(IAMC)లో నిర్వహించిన ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని తెలిపారు. మధ్యవర్తిత్వం వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, సింగపూర్ అంతర్జాతీయ మీడియేషన్ సెంటర్ ఛైర్మన్ జార్జ్ లిమ్ పాల్గొన్నారు. మొదటి ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీడియేషన్ డే కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు.
మధ్యవర్తిత్వం మన పురాణాల నుంచి వస్తోంది..!
మధ్యవర్తిత్వం అనేది మన పురాణాల నుండి వస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కౌరవులు, పాండవుల మధ్య కృష్టుడి మధ్యవర్తిత్వం విఫలం కావడం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్ లోనూ పెరిగిందని తెలిపారు. మీడియేషన్ బిల్లు రావడంతో మధ్యవర్తిత్వం ప్రాధాన్యం మరింత పెరిగిందని వెల్లడించారు. ఇరు పక్షాలకు ఉపయోగకరంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ సాగాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. మధ్యవర్తిత్వంలోనూ కృత్రిమ మేథను భాగం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో మీడియేషన్ సెంటర్ ను మొదట చిన్న స్థాయిలో ఏర్పాటు చేద్దామని అనుకున్నట్లు ఎన్వీ రమణ తెలిపారు. కానీ, జస్టిస్ లావు నాగేశ్వర రావు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఎంతో సహకరించారని తెలిపారు హైదరాబాద్ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు వెనక జస్టిస్ లావు నాగేశ్వరరావు కృషి ఎంతో ఉందని వెల్లడించారు.
న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశమని జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేదని చెప్పారు. మధ్యవర్తులు పరిష్కారం కోసం ఒత్తిడి చేయరని, పరిష్కారం కోసం తగిన వాతావరణం ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మూడు రకాల మధ్యవర్తిత్వాలు ఉన్నాయని, వాటిలో కోర్ట్ రిఫర్ మీడియేషన్, ప్రైవేటు మీడియేషన్ ముఖ్యమైనవని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. హైదరాబాద్ లోని మీడియేషన్ సెంటర్ ను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు జస్టిస్ రవీంద్రన్ పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లీలను జస్టిస్ ఎన్వీ రమణ ఎందుకు ఎంచుకున్నారో ఈ సెంటర్ ను చూస్తే అర్థం అవుతోందని తెలిపారు. మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదని, దాని గురించి అవగాహన కల్పించాల్సి ఉందని తెలిపారు. కోర్టు వివాదాల వల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అవుతున్నట్లు పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వందల కోట్లతో ముడిపడిన సమస్యలు కూడా రోజుల్లోనే పరిష్కారం కావొచ్చని వెల్లడించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















