Hit and Run Case: రంగారెడ్డి జిల్లాలో హిట్ అండ్ రన్.. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతు మృతి
Rangareddy Crime News | రంగారెడ్డి జిల్లాలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రైతును ఆటో ఢీకొట్టడంతో మృతిచెందాడు.

Rangareddy Hit and Run Case | హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్దార్ నగర్ ప్రాంతంలో అంబోజి యాదయ్య అనే రైతు హిట్ అండ్ రన్ (Hit and Run) ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. రోజూలాగే తన పొలం పనులను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో, వేగంగా వచ్చిన ఒక ఆటో యాదయ్యను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఆటో డ్రైవర్ ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం రైతు యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆ రైతు మృతి చెందాడు. కష్టపడి పనిచేసే రైతు ఇలా అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడంతో సర్దార్ నగర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రైతు యాదయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

రోడ్డు దాటే సమయంలో, రోడ్డు వెంట నడిచే సమయంలో పాదచారులు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అదే విధంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం అని, వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని.. కొన్ని సందర్భాలలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు.

























