Chiranjeevi On Pawan : పవన్ పై మితిమీరి విమర్శలు, మనసు చివుక్కుమంటుంది- చిరంజీవి
Chiranjeevi On Pawan : పవన్ కల్యాణ్ పై కొందరు మితిమీరి విమర్శలు చేస్తున్నారని, ఆ మాటలు వింటుంటే బాధ కలుగుతుందని చిరంజీవి అన్నారు.
Chiranjeevi On Pawan : జనసేన అధినేత, తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఎప్పటికైన ఉన్నత స్థానంలో ఉంటారని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాజాగా పవన్ రాజకీయ ప్రస్థానంపై చిరంజీవి మరోసారి స్పందించారు. పవన్ పై కొందరు చేసే విమర్శలు తనను ఎంతో బాధిస్తాయని చిరంజీవి అన్నారు. తన తమ్ముడిపై కొందరు మితిమీరి విమర్శలు చేస్తున్నారని, అవి విన్నప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పై కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. మెగాస్టార్ చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్లో భాగంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మితిమీరిన మాటలు
"పవన్ పై మితిమీరి మాటలు మాట్లాడుతున్నప్పుడు బాధ కలుగుతుంది. నా తమ్ముడిని విమర్శించిన వాళ్లు నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. పవన్ ను అన్ని మాటలు అన్నవారితో మళ్లీ మాట్లాడాల్సివస్తోందే, వాళ్లను కలవాల్సి వస్తోందే అనే బాధ ఉంటుంది. పవన్ నా బిడ్డలాంటి వాడు. మా కుటుంబం అంటే పవన్ కు ఎంతో ప్రేమ. డబ్బు, పదవులపై పవన్ కు వ్యామోహం లేదు. నిన్న మొన్నటిదాకా పవన్కు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ కొంతమంది అతడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. పవన్ను విమర్శించిన వాళ్లతో నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది"- చిరంజీవి
పవన్ ఉన్నత స్థానంలో
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని, ఓ దశలో మనకు రాజకీయాలు అవసరమా అని తాను ఆలోచించినట్లు తెలిపారు. రాజకీయాల్లో కొనసాగాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలని సున్నితంగా ఉండకూడదన్నారు. దాంతో ఇవన్నీ తనకు అవసరమా అని భావించానని, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగినవాడని.. తాను ఓ మాట అంటాడు, అనిపించుకుంటాడన్నారు. పవన్ ఏదో రోజు ఉన్నత స్థానంలో ఉంటాడని, అందుకు మీ ఆశీస్సులు కావాలి అన్నారు. తాను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశానని, పట్టుబట్టి సాధించుకునేవాడన్నారు. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయానంటూ రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైతేనేం రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చానని, తమ్ముడు పవన్ పాలిటిక్స్లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
సైలెంట్ గా ఉంటేనే
పవన్ కల్యాణ్ ఓ వైపు ఉండి.. తాను మరో వైపు ఉంటే సమస్యలు వస్తాయని తాను సైలెంట్గా ఉంటనే పవన్ కల్యాణ్ పొలిటికల్గా ఎమర్జ్ అవుతాడని గతంలో చిరంజీవి ప్రకటించారు. అంటే తమ్ముడి కోసం రాజకీయ కెరీర్ను త్యాగం చేశానని ఆయన చెప్పకనే చెప్పారు. పవన్కు తన మద్దతు తప్పక ఉంటుంది. భవిష్యత్లో ప్రత్యక్షంగా జనసేన కోసం పని చేస్తానేమో అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. దీంతో జనసేన పార్టీలోకి చిరంజీవి ఎంట్రీ ఇవాళ కాకపోతే.. రేపు.. రేపు కాకపోతే.. మరో రోజు కచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయానికి జనసైనికులు వస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets