BRS And BJP: బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
BRS: తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందంటున్నారు కానీ.. బీజేపీని మాత్రం ఏమీ అనడం లేదు బీఆర్ఎస్ నేతలు. ఒకప్పుడు బీజేపీపై యుద్ధమేనని ప్రకటించిన పార్టీ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉంటోంది ?

Telangana Bjp And BRS: బీఆర్ఎస్ విస్తృత కార్యవర్గ సమావేశం తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంశంపై మీడియా ప్రతినిధులు మాట్లాడినప్పుడు నో కామెంట్ అన్నారు. ఇప్పుడే కాదు.. బీజేపీపై విమర్శలు చేయడానికి కేసీఆర్, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా దూరంగా ఉంది. ఎందుకు అన్నది మాత్రం ఆ పార్టీ వ్యూహకర్తలకే తెలియాలి. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ముప్పు ఉంది మాత్రం బీజేపీ నుంచే అని ఇటీవలి రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి.
బీజేపీ ప్రస్తావించకుండా కేసీఆర్ రాజకీయం
భారత రాష్ట్ర సమితి కేసీఆర్ ఇటీవల తరచుగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు కానీ బీజేపీని మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు విమర్శించడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేయించారని.. బీఆర్ఎస్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో రేవంత్ విమర్శించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి సహకరించేందుకే పోటీ చేయడం లేదని అంటున్నారు. అయితే కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఎలా చూసినా బీజేపీ విషయంలో బీఆర్ఎస్ మెతక వైఖరితో ఉంది.
బీఆర్ఎస్కు బీజేపీ నుంచే ముప్పు
తెలగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే బీజేపీ నుంచి బీఆర్ఎస్ కు ముప్పు పొంచి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు వెళ్లింది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ కు అంత సమస్య వస్తుంది. అయినప్పటికీ బీజేపీతో వీలైనంత సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. బీజేపీతో లొల్లి పెట్టుకుంటే ఇప్పటికిప్పుడు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప రాజకీయంగా ఎలాంటి లాభం ఉండదని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
టీడీపీ, వైసీపీ తరహా రాజకీయం చేస్తున్నారా ?
ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రధాన ప్రత్యర్థులు. రెండు పార్టీలు బీజేపీని ఏ మాత్రం వ్యతిరేకించవు. ఇప్పుడు టీడీపీ కూటమిలో ఉంది. వైసీపీ లేదు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని వైసీపీ పల్లెత్తు మాట అనేది కాదు. ఇప్పుడు కూడా వైసీపీ అదే పనిలో ఉంది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఎదురైన ఘోర ఓటమితో చంద్రబాబు కూడా పాఠాలు నేర్చుకున్నారు. తర్వాత మోదీతో పరిచయాలు పెంచుకునేందుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత చంద్రబాబు బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని సీఎం అయ్యారు. అంటే బీజేపీతో గొడవ వల్ల ఏమాత్రం ఒరగదని పైగా తీవ్ర నష్టం అని ఆయనకు అర్థమైపోయింది. కేసీఆర్ ఇలాంటి రాజకీయాల్లో రెండాకులు ఎక్కువే చదివారుని అందుకే బీజేపీ విషయంలో సైలెంట్ గా ఉంటున్నారని ఉంటున్నారు.
అయితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ ప్రభావ శక్తిగా లేదు..కానీ తెలంగాణలో అధికారంపై కన్నేసింది. అందుకే కేసీఆర్ స్ట్రాటజీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది అంచనా వేయడం కష్టమేనంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

