Breaking News Live Telugu Updates: చంద్రబాబు సభలో అపశృతి, కాల్వలో పడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న (డిసెంబరు 26) మాల్దీవులు, దానిని ఆనుకొని ఉన్న కొమోరిన్ ప్రాంతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం బలహీనపడిందని తెలిపారు. ఏదైమైనప్పటికీ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతం మీద సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని చెప్పారు.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఇక్కడ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
చంద్రబాబు సభలో అపశృతి, కాల్వలో పడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఇద్దరు కార్యకర్తలు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కాల్వ నుంచి బటయకు తీసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
TS SSC Exams: ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్
ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు 6కు కుదించినట్లు చెప్పారు. వంద శాతం సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షలపై స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పరీక్షలకు సమయం 3 గంటలు కేటాయించారు.





















