Adilabad: మా పిల్లలకు ఆ టీచరే చదువు చెప్పాలి - బడికి తాళం వేసిన తల్లిదండ్రులు - ఎక్కడంటే?
Adilabad Teacher: ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఓ టీచర్ ను వేరే స్కూల్ కు డిప్యూటేషన్ పై పంపడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ పిల్లలకు ఆ టీచర్ తోనే చదువు చెప్పించాలని బడికి తాళం వేశారు.

Adilabad parents protest for teacher: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని వేరే చోటుకు డిప్యుటేషన్పై పంపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఏకంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేశారు. పిల్లల చదువుల విషయంలో అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల తమ బిడ్డల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పాఠశాల గేటు ముందే బైఠాయించి ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించారు.
ముగ్గురుటీచర్లు ఉంటే ఒకరికి డిప్యూటేషన్
ఈ పాఠశాలలో మొత్తం 63 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, బోధన కోసం కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అయితే, ఉన్నతాధికారులు అందులో ఒక ఉపాధ్యాయురాలిని డోర్లి గ్రామ పాఠశాలకు వారంలో మూడు రోజులు డిప్యుటేషన్పై పంపడం వివాదానికి దారితీసింది. ఇక్కడ ఉండాల్సిన టీచర్ను మరో చోటుకు కేటాయించడం వల్ల తమ పిల్లలకు సరిగ్గా పాఠాలు అందడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండల విద్యాధికారికి, జిల్లా కలెక్టర్కు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.
విద్యాధికారి నచ్చ చెప్పినా వినిపించుకోని తల్లిదండ్రులు
ఘటనా స్థలానికి చేరుకున్న మండల ఎంఈవో వెంకట్ రావు గ్రామస్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ పాఠశాలకు కేటాయించిన టీచర్ను ఇక్కడే పూర్తిస్థాయిలో ఉంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పాఠశాలను తెరిచేది లేదని భీష్మించుక కూర్చున్నారు. చర్చలు సఫలం కాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లిపోయారు. దీంతో పాఠశాల ఆవరణ బోసిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంఈవో పేర్కొన్నారు.
పిల్లల్ని తీసుకెళ్లిపోయిన తల్లిదండ్రులు
అధికారులు స్పందించి ఉపాధ్యాయురాలి డిప్యుటేషన్ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని చెబుతూనే, మరోవైపు ఉన్న టీచర్లను పక్కదారి పట్టించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ విన్నపాన్ని మన్నించి టీచర్ను యధావిధిగా కొనసాగించకపోతే, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకముందే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.























