Ravichandran Ashwin News: అశ్విన్ కు అరుదైన గౌరవం..! చెన్నైలో యాష్ నివాసముండే వీధికి తన పేరు!!
అశ్విన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లయితే తమ పేరిట వీధి పేరు కలిగిన అరుదైన క్రికెటర్ల జాబితాలో అతను చేరుతాడు. గతేడాది డిసెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు పలికాడు.

IPL 2025 MI VS CSK Updates: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు అరుదైన గౌరవం దక్కనుంది. తను నివసించే చెన్నై నగరంలో ఒక వీధికి అతని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. చెన్నైలోని వెస్ట్ మాంబళం ఏరియాలోని రామకృష్ణపురం రోడ్ నెం.1లో అశ్విన్ నివాసం ఉంటున్నాడు. అయితే అతను ఉండే వీధికి అతని పేరే పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే రోడ్డుకు పేరు గురించి అశ్విన్ కే చెందిన క్యారమ్ బాల్ ఈవెంట్, మార్కెటింగ్ అనే ప్రైవేట్ కంపెనీ ప్రపోజల్ తెచ్చినట్లు సమాచారం. ఇక చెన్నై కార్పోరేషన్ అశ్విన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లయితే తమ పేరిట వీధి పేరు కలిగిన అరుదైన క్రికెటర్ల జాబితాలో అశ్విన్ చేరుతాడు. ఇక గతేడాది డిసెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. తన కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
ధోనీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అశ్విన్..
కొత్త బంతినిచ్చి తనను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రొత్సహించాడని అశ్విన్ తెలిపాడు. 2009లో సౌతాఫ్రికాలో జరిగిన టోర్నీలో తనకు పవర్ ప్లేలో బౌలింగ్ చేసే అవకాశాన్ని ధోనీ కల్పించాడని కొనియాడాడు. అది తనకు టర్నింగ్ పాయింట్ అని, అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదని పేర్కొన్నాడు. గతేడాది మెగా వేలంలో అశ్విన్ తిరిగి చెన్నైకి వచ్చేలా ధోనీ పావులు కదిపాడు. అందుకు ధోనీకి అశ్విన్ థాంక్స్ చెప్పాడు. ఇక ఇంగ్లాండ్ తో ధర్మశాలలో జరిగిన టెస్టు తనకు వందోవది కావడంతో, దానికి ప్రత్యేక అతిథిగా ధోనీనీ రమ్మని పిలిచానని, అయితే ఆ వేడుకకు తను రాలేదని పేర్కొన్నాడు.
అద్భుతమైన గిఫ్ట్..
వందో టెస్టు సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, బీసీసీఐ ఒక స్పెషల్ మెమెంటోను అశ్విన్ కు బోర్డు అందజేసింది. అయితే ఈ మెమెంటోను ధోనీ చేతుల మీదుగా తీసుకోవాలని భావించానని, అయితే ఆ కల నెరవేరలేదని పేర్కొన్నాడు. అయితే అంతకన్నా పెద్ద గిఫ్టు తనకు ధోనీ ఇచ్చాడని, గతేడాది జరిగిన మెగా వేలంలో తనను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశాన్ని ధోనీ కల్పించాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇది తనకు చాలా విలువైనదని, మళ్లీ సీఎక్కే తరపున ఆడాలనే తన డ్రీమ్ నెరవేర్చినందుకు ధోనీకి థాంక్స్ చెప్పాడు.2008లో సీఎస్కే తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అశ్విన్.. 2015 వరకు ఆ టీమ్ తరపున ఆడాడు. అనంతరం వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడి, ఈ ఏడాది నుంచి మళ్లీ చెన్నై గూటికి చేరాడు. ఇక ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

