Ind Vs Eng 2nd Semifianl: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్.. హై వోల్టేజ్ మ్యాచులో ఇంగ్లాండ్పై విజయం
టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్ చేరుకుంది. మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా దూసుకెళ్లింది. ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా ఉత్కంఠపోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ సేన పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ పూర్తిస్థాయి ఆటతీరు ప్రదర్శించడంతో పటిష్ట ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధ్యమైంది.
మొదట టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ సంజూ శాంసన్ (89) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకూ పోరాడిన ప్రయోజనం దక్కలేదు. సెంచరీ హీరో జాకబ్ బెథెల్ (48 బంతుల్లో 105 పరుగులు) చివరి ఓవర్లో రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246 పరుగులు చేయడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
Marching towards the #Final 👏
— BCCI (@BCCI) March 5, 2026
A step away from 𝙂𝙡𝙤𝙧𝙮 🏆#TeamIndia is into the #T20WorldCup finale 🥳
Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#MenInBlue | #ENGvIND pic.twitter.com/6BBNkNw2aB
భారత్ రికార్డ్ స్కోరు..
2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్పై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించి, వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. 2012లో వెస్టిండీస్ నెలకొల్పిన 205 పరుగుల రికార్డును టీమ్ ఇండియా అధిగమించింది.
సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో (8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి, నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. అభిషేక్ శర్మ (9) త్వరగా అవుటైనా, ఇషాన్ కిషన్ (39) మెరుపులు మెరిపించాడు. అనంతరం శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, భారత బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచి ఫైనల్ దిశగా అడుగులు వేసింది.
ఛేజింగ్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్.. కానీ
ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ తొలి బంతికే ఫిల్ సాల్ట్ (5) ఔటయ్యాడు. పాండ్యా బౌలింగ్ లో అక్షర్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. టీ20 వరల్డ్ కప్ లో రాణిస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) బుమ్రా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. మరోవైపు జాక్ బెథెల్ వీర బాదుడు మొదలుపెట్టి టీమిండియా బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. అంత భారీ స్కోరును కాపాడుకోలేమా అనేలా బ్యాటింగ్ చేశాడు.
19 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. టామ్ బాంటన్ (17) అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. విల్ జాక్స్ (35)వేగంగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. శామ్ కరణ్ (14) కావడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లో తొలి బంతికి లాంగాఫ్ వైపు ఆడి రెండో పరుగు తీసే క్రమంలో పాండ్యా అధ్బుతమై త్రో వల్ల సెంచరీ హీరో జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ సిక్సర్లతో టెన్షన్ పెట్టాడు. 4 బంతుల్లో 3 సిక్షర్లు బాది 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేయడంతో ఓటమి తప్పలేదు.





















