Vontimitta Sri Sita Rama Kalyanam: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ వేదిక సిద్ధం - పార్కింగ్, అన్నప్రసాదం వివరాలు ఇవే!
Vontimitta Brahmotsavam: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ వేదిక సిద్ధం అయిందని వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏర్పాట్ల గురించి వివరించారు

Vontimitta Sri Sita Rama Kalyanam: ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని TTD, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తాం అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వామిఅమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఇంకా ఏర్పాట్ల గురించి వివరించారు.
కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని కల్యాణం వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, TTD ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండనున్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు అందుబాటులో ఉంచారు. కళ్యాణోత్సవానికి వచ్చే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరకీ వేడుక కనిపించేలా 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.
నిఘా భద్రతా విభాగం విషయానికొస్తే... TTD విజిలెన్స్ విభాగం నుంచి 400 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి 2500 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. 130 సిసి కెమెరాలు, 07 డ్రోన్ లు ఏర్పాటు చేశారు. కమెండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను ఏర్పాటు చేశారు.
పార్కింగ్ వివరాలు
సీతారాముల కల్యాణానికి హాజరయ్యే భక్తుల పార్కింగ్ కోసం సాలాబాద్ వద్ద 2, సాయి నగర్ వద్ద 3 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. సాలాబాద్ జంక్షన్ నుంచి సాయినగర్ వరకు దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ టీంలు ఏర్పాటు చేశారు.
అన్న ప్రసాద వివరాలు
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం కల్యాణం చూసేందుకు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందించనున్నారు.
దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు.
రవాణా సౌకర్యాలు
RTC ద్వారా కడప నుంచి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుంచి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో 220 ట్రిప్పులు ... మొత్తం 645 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుంచి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది.
పుష్పాలంకరణలు
సీతారాముల కల్యాణ వేదిక, ఆలయ పరిసరాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో అలంకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైద్యం
13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
పారిశుద్ధ్యం
ఇక కళ్యాణ వేదిక ఆలయ పరిసరాలలో 250 మరుగుదొడ్లు, టిటిడి జిల్లా యంత్రాంగం సమన్వయంతో 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు.
500 మంది TTD డిప్యూటేషన్ ఉద్యోగులు, 2500 మంది శ్రీవారి సేవకులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తారు.






















