Ganesh Chaturthi 2022 Live Updates: ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ
Ganesh Chaturthi 2022 Live Updates: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి 2022 వేడుకలు ప్రారంభమయ్యాయి. లైవ్ అప్డేట్స్ మీకోసం..

Background
"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం "వినాయక చవితి". శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని "వినాయక చవితి" జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు ప్రారంభమై..నవరాత్రులు వైభవంగా జరుగుతుంది. వినాయకచవితి రోజు ప్రతిఇంట్లో బొజ్జగణపయ్య సందడి ఉంటే.. మండపాల్లో మాత్రం దాదాపు 11 రోజుల పాటూ లంబోదరుడు పూజలందుకుని.. ఆ తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని "గణేష్ చతుర్ధి" లేదా "వినాయక చతుర్ధి" అని కూడా పిలుస్తారు.
విఘ్నాధిపతి
ఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు...ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని గణపతిని వేడుకుంటారు. అందుకే విఘ్నవినాశకుడు అయిన వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ వెనుక ఆసక్తికరమైన గాధలున్నాయి.
గణేష జననం
ఓసారి కైలాస నాధుడు లేని సమయంలో పార్వతీ దేవి స్నానమాచరించదలచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని భావించింది. నలుగుతో గణేశుడిని మలచి ప్రాణం ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి స్నానమాచరించేందుకు వెళ్లింది. అదే సమయంలో వచ్చిన శివుడిని లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాడు వినాయకుడు. కోపోద్రిక్తుడైన పరమ శివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. ఇంతలో బయటకు వచ్చిన పార్వతీదేవి..పుత్రశోకంలో కాళిగా మారుతుంది. పార్వతీ దేవి ఆగ్రహానికి భయపడిన దేవతలంతా పరమశివుడిని వేడుకొనగా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని అనుచరులకు ఆజ్ఞాపిస్తాడు.శివుని ఆజ్ఞననుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీ దేవి సంతోషిస్తుంది. ఏనుగు శిరస్సు ని ధరించినందువల్ల గజాననుడయ్యాడు.
మరొక గాధ ప్రకారం
గజాసురుడనే రాక్షసుని తపస్సుకి మెచ్చి ..తన కోరిక మేరకు ఉదరం( పొట్ట) లోనే ఉండిపోతాడు శివుడు. పతిని తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువుని పంపిస్తుంది పార్వతీదేవి. అలా శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుని ఆడించేవాని రూపంలో వెళ్లి గజాసురుని మెప్పించి..పరమేశ్వరుడిని తీసుకుని కైలాశానికి బయలుదేరుతాడు. ఆ గజాసురుడి తలే..వినాయకుడికి అమర్చారని మరో పురాణగాధ.
విఘ్నాధిపతిగా వినాయకుడే ఎందుకు!
విఘ్నాధిపతిగా వినాయకుడికిని పూజించడం వెనుక ఓ పురాణ గాధ ఉంది. ఒకసారి దేవతలు, ఋషులు శివుడిని కలిసి విఘ్నాలకు అధిపతిగా ఎవరినైనా నియమించమని అడుగుతారు. అప్పుడు శివపార్వతుల రెండవ కుమారుడు అయిన కుమార స్వామి... వినాయకుడు పొట్టిగా, లావుగా ఉన్నందువల్ల తనని విఘ్నాధిపతిగా నియమించమని అడుగుతాడు. శివుడు వినాయకుడికి, కుమారస్వామికి ప్రపంచం లో ఉన్న పవిత్ర నదులలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా తన దగ్గరికి వస్తారో వాళ్ళే విఘ్నాధిపతి అవుతారు అని చెప్తాడు. నెమలి వాహనంపై కుమారస్వామి పవిత్ర నదులలో స్నానమాచరించడానికి బయలుదేరతాడు. తన అవతారం చూసి కొంచెం కలత చెందిన వినాయకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి "తన సోదరుని వలే వేగంగా తాను కదలలేను కాబట్టి మీరే నాకు ఈ పరీక్ష నెగ్గేందుకు మార్గం తెలియచేయ"మని ప్రార్ధిస్తాడు.
Kanipakam Temple: గణపతికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
తిరుపతి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని , శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై శ్రీకాళహస్తి మాడవీధులలో కొలువై ఉన్న నవసంది గణపతులకు శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను సమర్పించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు, దేవస్థానం పాలకమండలి కమిటీ సభ్యులు.. గణపతులకు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఆయా ఆలయాల వద్ద గణపతి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేసారు.. నవసందీ గణపతులకు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో అఘోరాలు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. విఘ్నేశ్వరులకు పట్టు వస్త్రాలు సమర్పణ అనంతరం అఘోరాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆశీర్వదించారు..
Kanipakam: కాణిపాకంలో వైభవంగా చవితి వేడుకలు
సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం ప్రాతఃకాల ఆరాధనతో స్వామి వారిని మేలు కొల్పిన అర్చకులు, ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం స్వామి వారి దర్శనార్ధం భక్తులను అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు.. కాణిపాకం ఆలయంలో నేటి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది.. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు కాణిపాకం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగనుంది.. వినాయక చవితి పురష్కరించుకుని ఆలయంను వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అందంగా తీర్చి దిద్దారు.. వినాయక చవితి నాడు బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఆలయంకు చేరుకుంటున్నారు..





















