![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dussehra Balatripurasundari: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల్లో ఒకటి బాలాత్రిపుర సుందరీ దేవి. ఈ రోజు చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలందిస్తారు. ఏ వయసువారిని పూజించాలంటే..
![Dussehra Balatripurasundari: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది... Dussehra 2021 :Sri Bala Tripura Sundari Alankaram is the Day Of Kumari Pooja Dussehra Balatripurasundari: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/6dcf441481eba2896d4a62eb360abb5b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్
అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్
నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీ పురాణం చెబుతోంది. ఆ తొమ్మిది శక్తులో రెండవది కౌమారీ. ఈ రోజున బాలాత్రిపుర సుందరి అలంకారం చేసి చిన్నారులకు కౌమారీ పూజ చేస్తారు. అమ్మవారు మూడు రూపాల్లో కనిపిస్తుంది - ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. ఇందులో బాల త్రిగుణైక శక్తి - సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్యసంతోషం కలుగుతుందని విశ్వాసం. షోడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుల సుందరీ దేవి భక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజున బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి, కొత్తబట్టలు పెడతారు.
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం: బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళంతా అవిద్యా వృత్తులకు సంకేతం. వీళ్లంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో హంసలు లాగే రథంపై వచ్చిన కన్య ఈ 30 మంది భండాసుర పుత్రులనూ సంహరించింది. కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచీ బాల ఆరాధన చేయడం ప్రారంభించారు. హంసలు శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు.
ఏ వయసువారిని పూజించాలి: రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి. మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుందని చెబుతారు.
Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)