హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం రూ.13,600 కోట్ల అప్పు భారం, కేంద్ర-రాష్ట్ర రాజకీయ పోరు, విస్తరణ ప్రణాళికల ప్రతిష్టంభన మధ్య చిక్కుకుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయింది.
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
రూ.13,600 కోట్ల అప్పులు, టేకోవర్ ప్రతిష్టంభన, కేంద్ర-రాష్ట్ర రాజకీయ వివాదాల మధ్య అనిశ్చితిలో హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు. ఫేజ్-1, ఫేజ్-2 వరకు ప్రాజెక్టు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సవాళ్లు ఏమిటి?

- హైదరాబాద్ మెట్రో ₹13,600 కోట్ల అప్పుల భారం, రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది.
- ఎల్ అండ్ టీ నష్టాలతో ఫేజ్-1 నిర్వహణకూ నిరాకరించగా, ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.
- కేంద్రం నిధుల విడుదలకు అడ్డుపడుతోందని రాష్ట్రం ఆరోపణ; అది తప్పు అని కేంద్రం వాదన.
- నిధులు, అనుమతులు లేక మెట్రో విస్తరణ, స్వాధీనం ప్రక్రియ నిలిచిపోయింది.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఒకప్పుడు దేశంలోనే ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో... ఇప్పుడు రూ.13,600 కోట్ల అప్పు భారం, కేంద్ర-రాష్ట్ర రాజకీయ పోరు, విస్తరణ ప్రణాళికల పై ప్రతిష్టంభన మధ్య చిక్కుకుంది. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మెట్రో ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఈ వ్యవస్థ ఇప్పుడు రాజకీయ ఆరోపణల మధ్య చిక్కుకుంది. అసలు హైదరాబాద్ మెట్రో ఎందుకు ఈ పరిస్థితికి చేరుకుంది? విస్తరణ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు?
అంతర్జాతీయ మోడల్ నుండి అనిశ్చితి వరకు
హైదరాబాద్ మెట్రో ఒకప్పుడు మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) ప్రాజెక్టుగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మెట్రో మొదటి దశలో 69.2 కి.మీ మేర మూడు కారిడార్లలో (మియాపూర్-ఎల్బీనగర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం) నడుస్తోంది. ప్రారంభించినప్పుడు దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా ఉన్న హైదరాబాద్ మెట్రో, విస్తరణ పనులు నిలిచిపోవడంతో ఇప్పుడు తొమ్మిదో స్థానానికి చేరింది.
నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 162.5 కి.మీల విస్తరణతో రెండో దశ (Phase II) ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 30,000 ఎకరాల "భారత్ ఫ్యూచర్ సిటీ"కి మెట్రో సౌకర్యాన్ని కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. అంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే కి రేవంత్ సర్కారు మార్పులు చేసి ఈ ప్రణాళికలు రూపొందించింది.
సమస్య అసలెక్కడ మొదలైంది?
మెట్రో విస్తరణకు ప్రధాన అడ్డంకి ప్రస్తుత ఫైనాన్స్ మోడల్. హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు ఫేజ్-1 నిర్వహణకే ఏటా సుమారు రూ.400 కోట్ల నష్టం వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇంత అప్పుల భారంలో ఉన్న ఎల్ అండ్ టీ ఇప్పుడు ఫేజ్ -2 కోసం వేలకోట్ల పెట్టుబడులు పెట్టలేమని చేతులెత్తేసింది. అసలు ఫేజ్ - 1 మేము కొనసాగించలేమని చెప్పింది.
ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నిర్వహణ ఖర్చులు మరియు రుణ భారం కారణంగా పీపీపీ (PPP) మోడల్ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయిందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మెట్రోను మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ ప్రక్రియలో భాగంగా:
* ఎల్ అండ్ టీకి సుమారు రూ.1,450 కోట్ల తుది సెటిల్మెంట్ చెల్లించాలి.
* ఎల్ అండ్ టీకి ఉన్న సుమారు రూ.13,000 కోట్ల నుండి రూ.13,600 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలి.
* భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో నిధులు వెచ్చించి మెట్రో ఫేజ్ - 2 నడపాలని ప్రతిపాదించారు. అందుకు కేంద్రం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
రాజకీయ వివాదం ఎలా మొదలైంది?
మెట్రో టేకోవర్, రుణాల బదిలీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీనిలో కేంద్ర రాష్ట్రాలు చూపుతున్న కారణాలు వేరు వేరుగా వున్నాయి.
రేవంత్ రెడ్డి వాదన:
* ఎల్ అండ్ టీ తీసుకున్న 8.25% అధిక వడ్డీ రుణాలను తీర్చడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ద్వారా జపాన్ సంస్థ నుండి కేవలం 4% వడ్డీకే రూ.13,600 కోట్ల రుణం సిద్దంగా వుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం IRFC ఆమోదం తెలపడమే ఆలస్యమని ప్రకటించారు.
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ కారణాలతో ఐఆర్ఎఫ్సీ నిధుల విడుదలను అడ్డుకుంటున్నారని ఆయన బహిరంగంగా ఆరోపించారు.
కేంద్రం, విమర్శకుల అభ్యంతరాలు:
- ఐఆర్ఎఫ్సీ సాధారణంగా 8-8.5% వడ్డీకే రుణాలు ఇస్తుందని, 4% వడ్డీ రుణం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీఓ లో ఎక్కడా 4% అని స్పంష్టంగా లేదని కేంద్ర అధికారులు చెబుతున్నారు.
- రెండో దశలో అలైన్మెంట్ మార్పులు, భూగర్భ స్టేషన్ల వల్ల వ్యయం పెరగడంపై కూడా కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తింది. వాటిపై వివరణలివ్వాల్సిందిగా రాష్ట్రాన్ని కోరినా ఇంకా స్పష్టత ఇవ్వలేదని చెప్తోంది.
ప్రస్తుతం మెట్రో ఎక్కడ ఆగిపోయింది?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మెట్రో ప్రాజెక్టు కీలక దశలో ప్రతిష్టంభన ఎదుర్కొంటోంది.
- జూన్ 1 నాటికి మొదటి దశ టేకోవర్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఐఆర్ఎఫ్సీ(IRFC) నుండి నిధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
- టేకోవర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన ఖజానా నుండి సుమారు రూ.1,660 కోట్లను సెటిల్మెంట్ మరియు ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో ఖర్చు చేసింది. అయినప్పటికీ యాజమాన్య బదిలీ ఇంకా పూర్తి కాలేదు.
- కేంద్రం నుండి అవసరమైన అనుమతులు (DPR క్లియరెన్స్) రాకపోవడంతో రెండో దశలో ప్రతిపాదించిన కొత్త కారిడార్ల నిర్మాణం ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది.
మరి ఇప్పుడేంటి?
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో చిక్కుకుంది.
కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, 100% రాష్ట్ర ఈక్విటీతోనే రెండో దశను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకు కేంద్రం కేవలం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇస్తే చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ రాజకీయ, ఆర్థిక వివాదాలు పరిష్కారం కాకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్లతో పాటు నగరంలోని పలు కొత్త ప్రాంతాలకు మెట్రో విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు రానున్న హైదరాబాద్ నగర పాలక ఎన్నికల నాటికి ఈ వివాదం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.
అందుకే హైదరాబాద్ మెట్రో వివాదం కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు. నగర భవిష్యత్తు రవాణా వ్యవస్థ, పెట్టుబడులు, నగర విస్తరణ ప్రణాళికలకు సంబంధించిన కీలక ప్రశ్నగా మారింది.
Frequently Asked Questions
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటోంది?
హైదరాబాద్ మెట్రోలో PPP మోడల్ ఎందుకు విఫలమైంది?
ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నిర్వహణ ఖర్చులు మరియు అధిక రుణ భారం కారణంగా PPP మోడల్ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయింది. దీనివల్ల L&T సంస్థకు ఏటా రూ.400 కోట్ల నష్టం వస్తోంది.
హైదరాబాద్ మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికను రూపొందించింది?
మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా L&Tకి తుది సెటిల్మెంట్ చెల్లించి, దాని రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతోంది?
కేంద్రం నుండి DPR క్లియరెన్స్ రాకపోవడంతో కొత్త కారిడార్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. అలాగే, మొదటి దశ టేకోవర్ కోసం IRFC నుండి నిధులు విడుదల కాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
ట్రెండింగ్ వార్తలు






















