Top Morning News:

హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్టు

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు మిస్సింగ్‌.. తర్వాత అనుమానాస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దళిత యువకుడిది హత్యే అని విచారణ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పినిపే శ్రీకాంత్‌ ఆదేశాలమేరకే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ను హత్య చేశారని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేశ్‌ అనే యువకుడు పోలీసుల విచారణలో తెలపడం కలకలం రేపింది. అతను ఇచ్చిన సమాచారంతోనే  మంత్రి కుమారుడిని పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని.. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని  నాదెండ్ల మనోహర్ తెలిపారు. తదుపరి మంత్రివర్గ భేటీలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

జగన్‌పై లోకేశ్ మండిపాటు

గత ఐదేళ్ల పాలనలో వేల మంది చనిపోయినా, ఏనాడూ కనీసం ఒక్క సమీక్ష నిర్వహించని జగన్ లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నారని మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. ‘‘గంజాయి, డ్రగ్స్‌ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్, ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్‌. ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చావ్‌. అలాంటి నువ్వు లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నావా?’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

పవన్‌ కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం

ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్తను అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడిసరకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిందని, చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తన దృష్టికి రావడంతో అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

పెళ్లి చేసుకోమన్నందుకే విద్యార్థిని హత్య

బద్వేలులో ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు విఘ్నేశ్‌ కుట్ర ప్రకారమే బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. బాలికకు ఐదుళ్లుగా విఘ్నేష్‌తో పరిచయం ఉందని, పెళ్లి చేసుకోమని అడగడం వల్లనే బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించారు. మృతి చెందిన విద్యార్థిని, విఘ్నేశ్ ఒకే ఊరికి చెందిన వారని.. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారని 6 నెలల క్రితం విఘ్నేష్ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడంతో హత్యకు దారి తీసిందన్నారు. ఒకసారి మాట్లాడుదామని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దత్తాత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి హరియాణా వెళ్లేందుకు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. ఓ కారు సడన్ గా దత్తాత్రేయ కాన్వాయ్ దగ్గరకు రావడంతో కాన్వాయ్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ఏపీకి తుపాను ముప్పు

తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లోపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 22 నాటికి వాయుగుండంగా, ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

చికెన్‌ బిర్యానీలో కప్ప

బిర్యానీలో బల్లి, పురుగులు వస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదారాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగుతిన్న విద్యార్థులు మెస్‌ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

వయ‌నాడ్ బీజేపీ అభ్యర్థిగా న‌వ్య

వ‌య‌నాడ్ లోక్ స‌భ ఉప ఎన్నిక‌పై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బీజేపీ బ‌రిలోకి దింపుతోంది. బీజేపీ త‌ర‌ఫున ఆ రాష్ట్ర బీజేపీ మ‌హిళా మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అయిన న‌వ్య హ‌రిదాస్‌ పేరును ఖ‌రారు చేసింది. దీంతో ప్రియాంక‌కు పోటీగా సినీ న‌టి ఖుష్బూను నిల‌బెడతార‌నే వార్త‌లకు బీజేపీ నాయ‌క‌త్వం చెక్ పెట్టింది.

 

అన్‌స్టాపబుల్‌ సెట్‌లో చంద్రబాబు

నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న‘అన్‌స్టాపబుల్‌ 4’ సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్‌ షూట్‌ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి అన్‌స్టాపబుల్‌ సెట్‌లోకి బాలయ్య ఆహ్వానించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు వైరల్‌గా మారాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..