Pinipe Viswarup Son Srikanth Arrested: మాజీమంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన వాలంటీర్ హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడుగా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి గాలిస్తున్న ఖాకీలు రాత్రి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అక్కడే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఏపీకి తీసుకురానున్నారు. 


వాలంటీర్‌ దుర్గప్రసాద్ హత్య కేసులో పినిపె శ్రీకాంత్ అరెస్టు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు అయింది. వాలంటీర్ హత్య కేసులో ఏకంగా మాజీ మంత్రి కుమారుడు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని  అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిందీ దుర్గటన. కోనసీమ అల్లర్ల టైంలో వాలంటీరు దుర్గాప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు 2022 జూన్‌ 6న దుర్గా ప్రసాద్‌ను హత్య చేశారు.         


ధర్మేశ్ అరెస్టుతో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు


దుర్గా ప్రసాద్‌ను హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అప్పట్లోనే ఉప్పలగుప్తం మండలానికి వడ్డి ధర్మేశ్‌ను నిందితుడిగా చేర్చారు. ఆ వ్యక్తి దుర్గాప్రసాద్‌కు సన్నిహితుడే కాకుండా వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌గా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజుల తర్వాత ఈ నెల 18న ధర్మేశ్‌ను అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పినిపె శ్రీకాంత్‌తోపాటు ఈ మరో నలుగురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. 


ఇప్పటి వరకు పరారీలో ఉన్న శ్రీకాంత్‌  రాత్రి అరెస్టు 


ధర్మేశ్ అరెస్టు తర్వాత శ్రీకాంత్‌ సహా మిగతా నలుగురు పరార్ అయ్యారు. దుర్గాప్రసాద్‌ను ఎలా హత్య చేశారనే విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు ధర్మేశ్‌ చెప్పాడని తెలుస్తోంది. ధర్మేశ్‌ సహా నలుగురికి దుర్గప్రసాద్ హత్య బాధ్యతను అప్పగించినట్టు గుర్తించారు. స్థానికంగా ఉండే లాడ్జిలో హత్యకు కుట్ర జరిగిందని నిర్దారించారు. స్నేహితుడైన ధర్మేశ్‌ నమ్మించి దుర్గాప్రసాద్‌ను కోటిపల్లి రేవు వద్దకు తీసుకెళ్లాడు. వారిని మిగతా వాళ్లు ఫాలో అయ్యారు. రేవు వద్దే దుర్గాప్రసాద్‌ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. ఏం తెలియనట్టు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. 


Also Read: ప్రైవేట్ కళాశాల ఏవోపై ఇంటర్ విద్యార్థి హత్యాయత్నం - కత్తితో గొంతులో పొడిచాడు, తిరుపతి జిల్లాలో దారుణం


రెండేళ్లుగా ముందుకు సాగని దర్యాప్తు- భార్య ఫిర్యాదుతో కదలిన పోలీసులు 


తన భర్త కనిపించడం లేదని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహం లభించడంతో హత్య కేసుగా మార్చారు. అంతే తప్ప విచారణ చేయలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసిన దుర్గాప్రసాద్ భార్య న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు ముందు ధర్మేశ్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారించంతో మిగతా వారి గుట్టు విప్పాడు. దీంతో మిగతా వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. 


Also Read: 'ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి వదిలావ్' - నువ్వా మాట్లాడేది?, వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేశ్ ప్రశ్నల వర్షం