Air India Boeing 787 Crash: లోపాలు గురించి తెలిసి పట్టించుకోలేదు- ఎయిర్ ఇండియా తప్పిదాలు బహిర్గతం చేసిన ప్రాథమిక నివేదిక
Ahmedabad Plane Crash Report: టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఇంజిన్లు ఆగిపోయాయని, దీనిపై పైలట్లు మాట్లాడుకోవడం గురించి ప్రాథమిక నివేదిక వెల్లడించింది.

Ahmedabad Plane Crash Report: గత నెలలో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Boeing 787 Crash)లో 260 మంది మరణించారు. ఈ ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది.
టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఇంజిన్ ఇంధనాన్ని నియంత్రించే స్విచ్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఎందుకు స్విచ్లు ఆపావు అని ఒక పైలట్ సహచర పైలట్ను అడిగారని నివేదిక పేర్కొంది. తాను అలా చేయలేదని పైలట్ బదులిచ్చిన సంగతి కూడా నివేదికలో స్పష్టంగా తెలిపారు.
జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. అయితే, టేకాఫ్ అయిన దాదాపు 30 సెకన్ల తర్వాత, విమానం మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్లోకి దూసుకెళ్లింది. అంతే ఘోరం జరిగిపోయింది. ప్రయాణికులతోపాటు భవిష్య వైద్యులు కూడా మృత్యువాత పడ్డారు.
నివేదికలో కీలక విషయాలు
ఇంజన్లు ఆగిపోయాయి: నివేదిక ప్రకారం, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం "సుమారు 08:08:42 UTC వద్ద 180 నాట్స్ IAS గరిష్ట రికార్డు వేగానికి చేరుకుంది. ఆ వెంటనే, ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఇంధన కటాఫ్ స్విచ్లు సెకన్ల గ్యాప్తో ఒకదాని తర్వాత ఒకటి RUN మోడ్ నుంచి సడెన్గా CUTOFF మోడ్లోకి మారాయి."
పైలట్లు ఏం చేయలేదు: దీనిపై పైలట్లు మాట్లాడుకున్న విషయం గురించి నివేదిక ప్రస్తావించింది. "పైలట్లలో ఒకరు ఎందుకు కట్ చేశావని తన సహచర పైలట్ను అడిగినట్టు నివేదికలో ఉంది. దీనికి స్పందించిన ఆ పైలట్ తాను అలా చేయలేదని చెప్పాడు." అని స్పష్టంగా వెల్లడించింది.
RAT ఓపెన్: విమానాశ్రయం నుంచి తీసుకున్న CCTV ఫుటేజ్లో లిఫ్ట్-ఆఫ్ తర్వాత టేకాఫ్ టైంలో రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) ఓపెన్ చేసిన చూపించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
హెచ్చరిక పట్టించుకోలేదు: ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) 2018లో ఇంధన స్విచ్ నియంత్రణ డిజైన్ గురించి హెచ్చరించింది. "ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ ఫీచర్ కేపసిటీపై FAA 17డిసెంబర్ 2018న స్పెషల్ ఎయిర్వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ (SAIB) నంబర్ NM-18-33ను జారీ చేసింది" అని నివేదిక పేర్కొంది.
చెప్పిన తనిఖీలు చేయలేదు: స్పెషల్ ఎయిర్వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ (SAIB) "తప్పనిసరి" కాదు, అది కేవలం "సలహాదారు" అని ఎయిర్ ఇండియా కప్పిపుచ్చుకొని తనిఖీలు చేపట్టలేదని నివేదిక పేర్కొంది.
లోపాన్ని తెలియజేసిన సిబ్బంది: లండన్ వెళ్లే ముందు బోయింగ్ 787-8 విమానం AI423 ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు చేరింది. అప్పటికే విమానంలోని సిబ్బంది టెక్ లాగ్లో "STAB POS XDCR"స్టాటస్ మెసేజ్ కోసం పైలట్ డిఫెక్ట్ రిపోర్ట్ (PDR) ఎంట్రీ చేశారు. ఎయిర్ ఇండియా FIM ప్రకారం ట్రబుల్ షూటింగ్ చేసి పంపేశారు."
ఇంధన పరీక్షలు: బ్రౌజర్ల నుంచి ఇంధన నమూనాలను తీసుకున్నారు. విమానానికి ఇంధనం నింపడానికి ఉపయోగించే ట్యాంకులను DGCA ల్యాబ్లో పరీక్షించారు. సంతృప్తికరంగా ఉందని తేలింది" అని నివేదిక పేర్కొంది.





















