Delhi Assembly Elections : ఢిల్లీ ఎన్నికలు - ఫర్ ది ఫస్ట్ టైం - మధ్యతరగతి కుటుంబాల కోసం మేనిఫోస్టో రిలీజ్ చేసిన ఆప్
Delhi Assembly Elections : ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మధ్యతరగతి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మేనిఫెస్టోను విడుదల చేసింది.

Delhi Assembly Elections : దేశ రాజధాని ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యతరగతి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మేనిఫెస్టోను విడుదల చేసింది. పేద ప్రజల అవసరాలకనుగుణంగా లేదా కుల, మత సమీకరణల ఆధారంగా పలు రాజకీయ పార్టలు మేనిఫెస్టోను రూపొందిస్తున్నాయి. కానీ మధ్య తరగతి కుటుంబాల కోసం మేనిఫోస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
బడ్జెట్ 2025కి ముందు మధ్యతరగతి ఓటర్ల కోసం మేనిఫెస్టో రిలీజ్
మధ్య తరగతి కుటుంబాల కోసం మేనిఫెస్టోను విడుదల చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఈ వర్గం ప్రజలు పన్ను అనే ఉగ్రవాదానికి బాధితులుగా మారారని అన్నారు. "ఈ తరగతిలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, జీతాలు తీసుకునే ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు ఉన్నారు. ఏడాదికి రూ. 10-12 లక్షలు సంపాదిస్తోన్న ఒక మధ్యతరగతి వ్యక్తి ఆదాయంపై అనేక పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అతన్ని ఆదాయపు పన్ను చెల్లించమని ఒత్తిడి చేస్తోంది. ఈ పన్ను సెస్, రోడ్డు పన్నుల కంటే చాలా ఎక్కువ" అని ఆయన అన్నారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు మధ్య తరగతి ప్రజలను అణిచివేశాయని కేజ్రీవాల్ ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలు భారీ పన్నులు చెల్లించినప్పటికీ ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి ఏమీ పొందరని చెప్పారు. అన్ని పన్నులు కలిపితే, మధ్యతరగతి వ్యక్తి తన ఆదాయంలో 50 శాతానికి పైగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాడని తెలిపారు.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే, మధ్యతరగతి యువ జంటల కుటుంబ నియంత్రణ ఇప్పుడు ఆర్థిక నిర్ణయంగా మారిందని కేజ్రీవాల్ అన్నారు. బిడ్డను కనే ముందు, వారు తమ పెంపకాన్ని భరించగలరా అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారన్నారు. అధిక పన్నుల కారణంగా ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం విద్యా బడ్జెట్ను పెంచిందని, ప్రభుత్వ పాఠశాలలను మార్చిందని, ప్రైవేట్ పాఠశాలలను ఫీజులు పెంచకుండా నిరోధించిందని ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యతరగతి వర్గాలపై దృష్టి సారిస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్ 2025కు ముందు ఏడు డిమాండ్లను ఉంచారు.
- ఉన్నత విద్య కోసం రాయితీలు, స్కాలర్షిప్లు మంజూరు చేయాలి.
- ఆదాయపు పన్ను మినహాయింపు స్లాబ్ను రూ.7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలి.
- సీనియర్ సిటిజన్లు పెన్షన్, పదవీ విరమణ పథకాల ప్రయోజనాలను తప్పనిసరిగా పొందాలి.
- విద్యా బడ్జెట్ను జీడీపీలో 2% నుంచి 10%కి పెంచాలి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను పరిమితం చేయాలి.
- నిత్యావసర వస్తువులను తప్పనిసరిగా జీఎస్టీ రహితంగా మార్చాలి.
- సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీలను మళ్లీ ప్రవేశపెట్టాలి.
- ఆరోగ్య బడ్జెట్ను జీడీపీలో 10%కి పెంచాలి, ఆరోగ్య బీమాను పన్నుల నుంచి విముక్తి చేయాలి
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆప్, బీజేపీ మధ్య వివిధ సమస్యలపై పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఇక్కడ అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాగా ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.





















