Independence Day 2021: సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్టైక్స్తో వారికి హెచ్చరికలు పంపాం... ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్
ఈ ఏడాది ‘నేషన్ ఫస్ట్.. నేషన్ ఆల్వేస్’ అనే థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు.
LIVE
Background
75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ ఏడాది ‘నేషన్ ఫస్ట్.. నేషన్ ఆల్వేస్’ అనే థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకన్ని ఎగురవేయడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఒలింపిక్స్ పతక విజేతలను ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు.
సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్స్టైక్స్తో హెచ్చరికలు పంపాం..
భారత్ ఇప్పుడూ పూర్తిగా మారిపోయిందని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానికి దాడులతో భారత్ అంటే ఏంటో శత్రు దేశాలకు తెలిసేలా చేశాం. భారత్ ఇకనుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని వారికి ఇప్పటికే అర్థమై ఉంటుదన్నారు మోదీ.
నిరుపేదలకు పోషకాహారం, వైద్యం
సంక్షేమ పథకాలు అర్హులకు తప్పకుండా అందాలి. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని వచ్చే రెండేళ్లలో అందిస్తాం. పేదవారికి పోషకాహార లోపం ఉంటుంది. కనుక రేషన్ దుకాణాలలో వీరికి పోషకాహార ధాన్యాలు అందించే దిశగా అడుగులు వేస్తాం. వైద్య సదుపాయాన్ని సైతం అందించడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సైనిక్ స్కూళ్లల్లో బాలికలకు అవకాశాలు..
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ఎర్రకోటలో మోదీ పేర్కొన్నారు. బాలికలు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదని, వారికి చేయూత అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అనవసర చట్టాలు రద్దు..
గతంలో ప్రతి విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది. ప్రస్తుతం చాలా మార్పులొచ్చాయి. గత ఏడేళ్ల కాలంలో ప్రజలకు అనవసరమైన చట్టాలు, పద్ధతులు, విధానాలపై చర్యలు తీసుకున్నాం. అనవసర చట్టాలను రద్దు చేసినట్లు తన ప్రసంగంలో ప్రధాని మోదీ గుర్తుచేశారు.
దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ 75 వందే భారత్ రైళ్లు
దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయల కల్పనకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం రూ.100 లక్షల కోట్ల నిధిని సమకూర్చుకునేందుకు పీఎం గటి శక్తి ప్లాన్ అమలు చేయనున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. 75 వందే భారత్ రైళ్లు దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతాయని.. 75 వారాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇది సుసాధ్యం చేస్తామన్నారు.
రైతులు, గ్రామాలు వేగంగా అభివృద్ధి
గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు దేశంలో అన్ని గ్రామాలకు అందుబాటులోకి తెస్తున్నాం. మరికొన్ని రోజుల్లో గ్రామాలకు ఇంటర్ నెట్ సౌకర్యం సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. రైతులు దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు అందించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఛోటా కిసాన్ బనే దేశ్ కి షాన్ అని మోదీ వ్యాఖ్యానించారు. సన్నకారు రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 70కి పైగా కిసాన్ రైళ్లు ప్రారంభించామని గుర్తుచేశారు.
దళితులు, ఎస్టీలు, ఇతర వర్గాలకు రిజర్వేషన్
దళితులు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వారు, జనరల్ కేటగిరీలోని పేదవారికి న్యాయం చేసేందుకు రిజర్వేషన్లపై పునరాలోచిస్తున్నాం. ఇటీవల ఓబీసీ బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రాలు తమ ఓబీసీ జాబితా సిద్ధం చేసుకునే అవకాశాన్ని కల్పించామని తన ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి..
ప్రతి ప్రాంతం అభివృద్ధికి నోచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్ముకాశ్మీర్, లఢాఖ్ లాంటి ప్రాంతాలు సైతం దేశ అభివృద్ధికి పునాదులుగా మారుతాయని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్లో ఇదివరకే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు వేయనున్నామని స్పష్టం చేశారు.
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
సంక్షేమ పథకాల విలువ పేదవారికి మాత్రమే తెలుసు. గత ఏడేళ్లలో ఉజ్జ్వల నుంచి ఆయుష్మాన్ వరకు అనేక పథకాలను పేద వారికి అందేలా చేశాం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేసింది. ఇదే తీరుగా మరిన్ని సంక్షేమ పథకాలకు పేదలకు అందిస్తాం.
సబ్కా ప్రయాస్ చాలా ముఖ్యం
ఇప్పటివరకూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. మన నినాదంగా ముందుకు సాగాం. కానీ వీటితో పాటు సబ్కా ప్రయాస్ సైతం మన నినాదంలో చేరితేనే ప్రయోజనం ఉంటుంది. కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదు.. బాధ్యత గల పౌరులుగా నిరంతరం శ్రమ, పట్టుదలతో ఉంటే అన్నీ సాకారమవుతాయని మోదీ అన్నారు. మరో 25 ఏళ్లు.. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచంలోనే మెరుగైన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets