![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RTI: అందుకే వర్షాలు పడట్లేదు, దేవుడిని అడిగి చెప్పండి - బిహార్ వాసి స.హ.చట్టం దరఖాస్తు
RTI: అయితే బిహార్కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం గురించి తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. వర్షాలు ఎందుకు కురవం లేదో దేవుడిని అడిగి చెప్పాలని దరఖాస్తు చేశాడు.
![RTI: అందుకే వర్షాలు పడట్లేదు, దేవుడిని అడిగి చెప్పండి - బిహార్ వాసి స.హ.చట్టం దరఖాస్తు ‘Ask God and tell me why there is less rain': Bihar man files bizarre RTI citing Chandrayaan-3 mission RTI: అందుకే వర్షాలు పడట్లేదు, దేవుడిని అడిగి చెప్పండి - బిహార్ వాసి స.హ.చట్టం దరఖాస్తు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/08/a9734d4a2365427d6aa39bb36cc280891694181493517798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RTI: సమాచార హక్కు చట్టం.. దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వ సంస్థలు, యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కును దీని ద్వారా కల్పించింది. ఈ చట్ట ప్రకారం ప్రైవేటు సంస్థల సమాచారాన్ని సైతం ప్రభుత్వ యంత్రాంగాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఆ చట్టాలు అమల్లో ఉన్నంత వరకు, ఇలాంటి ప్రైవేటు సంస్థల డేటా కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. రికార్డులు, డాక్యుమెంట్లు, ఈ-మెయిల్స్, ఒపీనియన్స్, పత్రికా ప్రకటనలు, ఆర్డర్లు ఏదైనా సమాచారాన్ని ఈ చట్టం ద్వారా అడగొచ్చు.
అయితే బిహార్కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం గురించి తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. వానాకాలంలో ఎండలు, ఉక్కపోతతో విసిగిపోయిన బిహార్ వాసి కేంద్ర భూవిజ్ఞాన శాఖ అధికారులకు విచిత్రమైన దరఖాస్తు చేశాడు. సకాలంలో వర్షాలు కురవడం లేదని, ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. దీనికి కారణమేంటో కచ్చితమైన సమాచారం ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ప్రకారం కోరారు. అందులో దేవుడిని కూడా ఓ ప్రతివాదిగా చేర్చారు. దేవుడిని అడిగి అయినా సరే సమాచారం ఇవ్వాలని దరఖాస్తులో పేర్కొన్నారు.
ప్రస్తుతం బిహార్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా సరిగ్గా వర్షాలు కురవలేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గమనించిన గౌరాబౌరమ్ జిల్లా మహౌర్కు చెందిన రాజ్కుమార్ ఝా అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాడు. తమ ప్రాంతంలో వర్షం ఎందుకు కురవట్లేదో చెప్పాలని భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేశాడు. అవసరమైతే దేవుడిని అడిగి తనకు సమాచారం ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఏమైనా ఉపయోగపడుతుందేమో పరిశీలించాలని కోరారు.
ఆయన తన దరఖాస్తులో ఏమని రాశారంటే.. ‘దేవుడు సకాలంలో వర్షాలు ఎందుకు కురిపించడం లేదు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత ప్రకృతి కదలికలు ఆగిపోయాయా?’ కచ్చితంగా సమాధానం చెప్పాలి. అవసరమైతే ఆ దేవుడినే అడిగి తెలుసుకోవాలి. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ దేవుడి నుంచి సంకేతాలను సేకరించి ల్యాండర్ సాయంతో భూమికి చేరవేస్తుంది. వాటిని విశ్లేషించి వర్షాలు ఎందుకు కురవట్లేదో తెలపాలి. అత్యాధునిక సాంకేతికతను వాడైనా సరే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని రాజ్కుమార్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.
అంతే కాదు వర్షాలు ఎందుకు కురవడం లేదో ఓ అనుమానం సైతం వ్యక్తం చేశాడు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు కొట్టిందని, దానికి అమర్చిన అధునాతన పరికరాలతో ప్రకృతి ఏమైనా స్తంభించిపోయి ఉంటుందని రాజ్కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విలేకరులు రాజ్కుమార్ను ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం విని వారికి దిమ్మ తిరిగింది. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ దేవుడి నుంచి సంకేతాలను సేకరించి ల్యాండర్ సాయంతో భూమికి చేరవేస్తుందని రాజ్కుమార్ విలేకరులకు సమాధానం ఇచ్చారు. వాటిని పరిశోధించి వాతావరణ మార్పులకు గల కారణాలను తెలుసుకోవచ్చంటూ చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆర్టీఐ దరఖాస్తు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)