
YSRCP Vs BJP: ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవట్లేదు. మీరే గొయ్యి తవ్వుకున్నారు.. వైసీపీకి బీజేపీ కౌంటర్..!
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని కూల్చి కాషాయ కండువా కప్పుకున్న బాబాను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి బీజేపీ కుట్ర చేస్తోందని పేర్ని నాని ఆరోపించారు. దానిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూల్చే ప్రయత్నం చేస్తోందంటూ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ దియోధర్ పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తమకు జగన్ సర్కార్ను కూల్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా లేదని.. కానీ ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి,అది చాలదన్నట్టు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారని ట్వీట్ చేశారు.
పేర్ని నాని గారు-మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు,ఆ ఆలోచన కూడా మాకులేదు
— Sunil Deodhar (@Sunil_Deodhar) August 7, 2021
ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి,అది చాలదన్నట్టు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు pic.twitter.com/8RCqiaKdkL
అలాగే కేంద్రం కూడా అప్పులు చేస్తోందన్న పేర్ని నాని చేసిన విమర్శలపైనా సునీల్ ధియోధర్ స్పందించారు. కేంద్రం అప్పులు చేసినా... పప్పు, బెల్లాల్లా పంచడానికి చేయడం లేదని విమర్శించారు. కేంద్రానికి ఉన్న ఆర్థిక స్థోమత, వెసులుబాటు మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ దేశ ప్రతిష్టను పెంచుతూంటే వైసీపీ రాష్ట్రాన్ని ముంచుతోందని మండిపడ్డారు.
కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి?
— Sunil Deodhar (@Sunil_Deodhar) August 7, 2021
కేంద్రానికున్న ఆర్థిక స్థోమత,వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నదా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు. మేం దేశ ప్రతిష్ట పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు.
పేర్ని నాని వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా బీజేపీపై ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతోనే చేసినట్లుగా ఆ పార్టీ నేతలు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా కేంద్రంపై ఒత్తిడి చేసి అప్పులకు అనుమతి ఇచ్చేలా చేసుకోవడానికి ఈ వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో వైసీపీకి గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా.. పేర్ని నాని ప్రకటనను ఖండించారు. ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లు ఉందని విమర్శించారు.
'ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లుంది' మీ వ్యవహారం సీఎం @YSJagan గారు. అప్పులతో రాష్ట్రాన్ని ఈదలేక, కేంద్రంపై నిందలుమోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును ఫాలో అవుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉందని అర్ధమవుతోంది.https://t.co/7BTKYxSjHI
— GVL Narasimha Rao (@GVLNRAO) August 7, 2021
కేంద్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగానే ఉంటోంది. రాష్ట్రంలోనూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్న సందర్భాలు కూడా తక్కువే. అయితే అనూహ్యంగా పేర్ని నాని బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా కలకలం ప్రారంభమైంది. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తారా లేక వరుస విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

